ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల రైతుల దశాబ్దాల కల సాకారమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో చేపట్టిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఎట్టకేలకు పూర్తి కావడమే కాకుండా, అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా ముగిసింది. నీటి విడుదలకు మార్గం సుగమం కావడంతో స్థానిక రైతుల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాగునీటి ఆశలు చిగురించాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా రఘునాథపాలెం మండలంలోని సుమారు 36 చెరువులను కలుపుతూ నెట్వర్క్ను రూపొందించారు. దీని ద్వారా దాదాపు 3000 ఎకరాలకు పైగా మెట్ట భూములకు పుష్కలంగా సాగునీరు అందనుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన నుంచి అమలు వరకు నిరంతరం పర్యవేక్షించడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి. గతంలో నీటి ఎద్దడితో ఇబ్బందులు పడ్డ ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలం కానుంది.
ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమ పొలాలకు నీరు అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో పంటల దిగుబడి పెరుగుతుందని, ఆర్థికంగా నిలదొక్కుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నీటి పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండటంపై వ్యవసాయ శాఖ అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.
తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు ఈ ప్రాంత రైతాంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి అంటే మాటల్లో కాకుండా పనుల్లో చూపిస్తున్నారని వారు కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నాయకులకు అభినందనలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa