ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచులు మరియు ఉప సర్పంచులను గౌరవిస్తూ ప్రత్యేక అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ ముఖ్య అతిథిగా పాల్గొని, గెలుపొందిన ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. పార్టీ పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ఈ విజయం నిరూపించిందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
సన్మాన కార్యక్రమం అనంతరం డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని, ప్రజల కనీస అవసరాలైన సాగునీరు, తాగునీరు మరియు రహదారుల నిర్మాణంలో నాణ్యత పాటించాలని ఆయన నూతన సర్పంచులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా గ్రామాల్లో సామాజిక మార్పుపై దృష్టి పెట్టాలని యుగంధర్ నొక్కి చెప్పారు. అక్షరాస్యత శాతాన్ని పెంచడం ద్వారానే చైతన్యం వస్తుందని, ప్రతి బిడ్డ పాఠశాలకు వెళ్లేలా సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛత పాటించడం ద్వారా అంటువ్యాధులు దరిచేరకుండా గ్రామాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు. గ్రామంలోని యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు మత్తు పానీయాలకు, మద్యానికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని నాయకులు సూచించారు. నియోజకవర్గ అభివృద్ధిలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa