శైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పనుల పురోగతి, సాంకేతిక సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు.
సొరంగం తవ్వకాల్లో నూతన టెక్నాలజీ..
గతంలో వినియోగించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ స్థానంలో ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలి ఉన్న 9.8 కిలోమీటర్ల సొరంగం మార్గంలో భూగర్భ పరిస్థితులను అంచనా వేసేందుకు ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ఇప్పటికే పూర్తి చేశారు. తవ్వకం సమయంలో మట్టి పొరలు విరిగిపడకుండా ఉండేందుకు పటిష్టమైన సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తి కావడానికి వీలుగా సొరంగం రెండు చివరల నుండి ఏకకాలంలో తవ్వకాలు జరపడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టు.. కఠినమైన రాతి పొరలు, సాంకేతిక లోపాల వల్ల రెండు దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. గతంలో వాడిన టీబీఎం యంత్రాలు భూగర్భంలోని వేడికి, కఠిన శిలల ఒత్తిడికి తరచూ పాడైపోవడంతో పనులు నిలిచిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో నిధుల కొరత, కాంట్రాక్టర్ల సమస్యల వల్ల నల్గొండ జిల్లా రైతులకు అందాల్సిన సాగునీరు , ప్రజల తాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి 25 శాతం అదనపు జీతాలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే పనుల పర్యవేక్షణ కోసం ప్రతి సోమవారం సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సొరంగం పూర్తయితే నల్గొండ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు.. ఫ్లోరోసిస్ భూతం నుంచి జిల్లాకు శాశ్వత విముక్తి లభించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa