ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హుస్నాబాద్‌ను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపడం ఖాయం,,,మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 11, 2026, 08:41 PM

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హుస్నాబాద్ ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.


‘హుస్నాబాద్ తిరిగి కరీంనగర్‌కే’..


హుస్నాబాద్ నియోజకవర్గంలోని జిల్లెలగడ్డలో అర్బన్ పార్కుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో కలిపిందని ఆయన విమర్శించారు. భౌగోళికంగా, పరిపాలనా పరంగా హుస్నాబాద్ ప్రజలకు కరీంనగర్‌తోనే విడదీయలేని అనుబంధం ఉందని గుర్తు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దుల మార్పులు చేపట్టినప్పుడు హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపడం ఖాయమని ఆయన భరోసా ఇచ్చారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని ఇప్పుడు ముఖ్యమంత్రిగా అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.


ఇటీవల అసెంబ్లీ వేదికగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చేసిన ప్రకటన ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చింది. గతంలో రాజకీయ లబ్ధి కోసమే చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారని.. దీనివల్ల పాలనలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. జనాభా, విస్తీర్ణం, ప్రజల సౌకర్యాన్ని బట్టి జిల్లాల సరిహద్దులను సవరించేందుకు ఒక నిపుణుల కమిటీని వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా అశాస్త్రీయంగా విడిపోయిన మరికొన్ని మండలాలను పాత జిల్లాల్లో చేర్చాలని విజ్ఞప్తులు అందుతున్నాయి. ప్రభుత్వం వీటిని క్షుణ్ణంగా పరిశీలించి మున్సిపల్ ఎన్నికల లోపే ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సర్వాయి పాపన్న పార్క్: జిల్లెలగడ్డ అర్బన్ పార్కుకు చారిత్రక నేపథ్యం ఉన్నందున దానికి 'సర్వాయి పాపన్న అర్బన్ పార్క్' అని పేరు పెట్టాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులతో పాటు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


ఇదిలా ఉండగా.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జన్మస్థలమైన వంగరను కేంద్రంగా చేసుకుని 'పి.వి. నరసింహారావు జిల్లా'ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. హుజూరాబాద్ లేదా ఇతర సమీప ప్రాంతాలను కలిపి ఆయన పేరుతో జిల్లాను ప్రకటించాలని ఇప్పటికే పలు ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలైతే హుస్నాబాద్ మార్పు అనేది ఒక ఆరంభం మాత్రమే అవుతుందని.. మరిన్ని జిల్లాలు, మండలాల సరిహద్దుల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa