ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఉద్యోగుల డీఏపై సీఎం కీలక ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 07:14 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం ఫైలుపై సంతకం చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెలా రూ. 227 కోట్ల అదనపు భారం పడనుందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ.. ఉద్యోగుల మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతోనే ఈ అడుగు వేసినట్లు చెప్పారు.


గత ప్రభుత్వ హయాంలో జీతాల కోసం నెలంతా వేచి చూడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల కుటుంబాలకు రక్షణగా రూ. 1 కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులే కీలకమని.. రాష్ట్ర అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలని కోరారు. పాలనాపరమైన సవాళ్లు మరియు జిల్లాల పునర్వ్యవస్థీకరణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


గత పాలకులు రూ. 1.11 లక్షల కోట్ల బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే ప్రజలకు.. రైతులకు మరియు ఉద్యోగులకు మేలు చేసేందుకు కష్టపడుతున్నామని వివరించారు. ఫామ్‌హౌస్‌లో ఉంటూ కొందరు ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని.. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యజ్ఞాలను అడ్డుకునే మారీచుల వలె కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కేవలం నాలుగు లేదా ఐదు మండలాలతో జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని గుర్తించామన్నారు. దీనిపై రిటైర్డ్ అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసి, ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల సరిహద్దులను శాస్త్రీయంగా సవరించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa