ఏపీలో నిర్మించ తలపెట్టిన పోలవరం- నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే సోమవారం (జనవరి 12) అత్యున్నత ధర్మానసంలో పిటిషన్ విచారణ సందర్భంగా అనూహ్యం పరిణామం చోటుచేసుకుంది. పోలవరం- నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అధికారికంగా వెల్లడించారు. పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. కేసును డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.
పోలవరం- నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. అయితే రిట్ పిటిషన్లా కాకుండా.. సివిల్ సూట్ రూపంలో మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని సీజేఐ సూచించారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అందుకే పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. దీంతో సివిల్ సూట్ రూపంలో మరోసారి తెలంగాణ ఈ అంశంపై పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఏపీ ఉల్లంఘనలకు పాల్పడుతోంది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టుపై తాము అభ్యంతరాలతో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించామన్నారు. అయితే కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడుకోవద్దనేది ఇందులో ముఖ్యమైన అంశమని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఏపీ అనేకసార్లు ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాటిని కూడా అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చామన్నారు. అంతేకాకుండా ఏపీ స్టాప్ వర్క్ ఆర్డర్ను అమలు చేయడం లేదని కోర్టుకు నివేదించినట్లు వెల్లడించారు. ఏపీకి కేటాయించింది 484.5 టీఎంసీలేనని.. కానీ దానికి మించి ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాలు చేస్తోందన్నారు. గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ఏపీ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని కోర్టుకు చెప్పినట్లు వెల్లడించారు.
ఏంటీ వివాదం?
ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పోలవరం నుంచి నల్లమల సాగర్కు నీటిని తరలించే లింక్ ప్రాజెక్టు నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేవని, బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని ఆ పిటిషన్లో ఆరోపించింది తెలంగాణ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa