ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యూచర్ సిటీలోని ఆ భూములు రైతులకే.. పెరుగుతున్న డిమాండ్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 12, 2026, 07:32 PM

తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించిన భూములను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తుండటంతో.. ఆ భూములను తిరిగి తమకే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.


ఫార్మా సిటీ నుండి ఫ్యూచర్ సిటీ వరకు..


గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో దాదాపు 19,333 ఎకరాల భూమిని ఫార్మా సిటీ ఏర్పాటు కోసం సేకరించింది. ఔషధ రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు స్థానంలో 'ఫ్యూచర్ సిటీ'ని నిర్మించాలని నిర్ణయించింది. ఫార్మా రంగం కోసం ఇచ్చిన భూములను రియల్ ఎస్టేట్ లేదా ఇతర వాణిజ్య అవసరాలకు వాడటంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశించిన ప్రాజెక్టును రద్దు చేసినందున.. భూమిని తిరిగి తమకే అప్పగించాలని వారు కోరుతున్నారు.


2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం.. ఏ అవసరం కోసం భూమిని సేకరించారో అదే ప్రయోజనానికి వాడాలి. ఒకవేళ ఆ ప్రాజెక్టు సాధ్యపడకపోతే, ఆ భూమిని తిరిగి అసలు యజమానులకు ఇవ్వాలి లేదా ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్‌లో ఉంచాలి. కానీ ఇతర వ్యాపారాలకు వాడటం చట్టవిరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఫార్మా సిటీ ప్రస్థానం 9 సంవత్సరాల క్రితం మొదలైంది. అప్పట్లో కాలుష్య నియంత్రణ చర్యలతో అతిపెద్ద పారిశ్రామిక క్లస్టర్‌గా దీన్ని తీర్చిదిద్దాలనుకున్నారు. కానీ స్థానికుల నుండి వచ్చిన నిరసనలు, కాలుష్యంపై ఆందోళనల వల్ల పనులు ఆలస్యమయ్యాయి.


ప్రస్తుత ప్రభుత్వం పర్యావరణ అనుకూలమైన 'ఫ్యూచర్ సిటీ'ని అక్కడ నిర్మించాలని భావిస్తోంది. ఇందులో విద్య, వైద్యం, ఐటీ , క్రీడా రంగానికి పెద్దపీట వేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. భూములను మళ్లించడంపై ఇప్పటికే కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సేకరించిన భూమిలో కేవలం ప్రభుత్వం మార్పులు చేయడమే కాకుండా.. ఉద్దేశించిన ప్రయోజనాన్ని పూర్తిగా మార్చేయడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని వారు వాదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇది కూడా ప్రజా ప్రయోజనార్థం చేపడుతున్న ప్రాజెక్టు అని.. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతోంది. అయితే పరిహారం తక్కువగా ఇచ్చి, ఇప్పుడు ఆ భూమి విలువ పెరిగిన తర్వాత ఇతర అవసరాలకు వాడటంపై రాజకీయంగా కూడా విమర్శలు వస్తున్నాయి.


ఇదిలా ఉండగా.. రేవంత్ సర్కార్ మాత్రం హైదరాబాద్ ఫోర్త్ సిటీ (భారత్ ఫ్యూచర్ సిటీ) ప్రాజెక్టు పనులు శరవేగంగా చేపడుతోంది. ఈ ప్రపంచస్థాయి నగరం గురించి పెట్టుబడిదారులకు, ప్రజలకు పూర్తి సమాచారం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఐటీ శాఖ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందిస్తోంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ పేరుతో సిద్ధమవుతున్న ఈ పోర్టల్‌లో ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడి అవకాశాల వివరాలు అందుబాటులో ఉంటాయి. పారదర్శకతను పెంచుతూ, అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని ప్రమోట్ చేయడం ఈ వెబ్‌సైట్ ప్రధాన లక్ష్యం. అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa