నల్లమలసాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలువరించేందుకు తెలంగాణ సర్కార్ తన వ్యూహానికి పదును పెడుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన మేడారంలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏపీ తీరును ఎండగట్టడంతో పాటు, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు అనుసరించాల్సిన తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించనుంది.
ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గతంలో దాఖలు చేసిన పిటిషన్పై ఇటీవల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్కు విచారణార్హత లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో, తెలంగాణ ప్రభుత్వం దానిని వెనక్కి తీసుకుంది. అయితే, న్యాయపోరాటంలో వెనకడుగు వేయకుండా, మరింత పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సాంకేతిక కారణాలతో కేసు వీగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై న్యాయ నిపుణులతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతోంది.
ఏపీ సర్కార్ సాగిస్తున్న నల్లమలసాగర్ పనులను అడ్డుకోవడానికి ఈసారి 'సివిల్ దావా'ను ఆయుధంగా చేసుకోవాలని తెలంగాణ భావిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ఆధారాలతో కూడిన బలమైన సివిల్ సూట్ను కోర్టులో దాఖలు చేయడం ద్వారా ఏపీ దూకుడుకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ సివిల్ దావాకు సంబంధించిన ముసాయిదాపై, అలాగే అందులో చేర్చాల్సిన కీలక న్యాయపరమైన అంశాలపై 18న జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నల్లమలసాగర్ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని, నీటి కేటాయింపుల్లో ఎదురయ్యే ఇబ్బందులను జాతీయ స్థాయిలో ఎత్తిచూపడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. కేవలం న్యాయపోరాటమే కాకుండా, రాజకీయంగా కూడా ఒత్తిడి పెంచేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మేడారం క్యాబినెట్ భేటీ తర్వాత ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన తదుపరి కార్యాచరణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది, ఇది రెండు రాష్ట్రాల మధ్య జల జగడంలో కీలక మలుపుగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa