తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకముగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగవంతంగా పుంజుకుంటోంది. లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, బిల్లుల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుత వారానికి సంబంధించి మొత్తం రూ.152.40 కోట్ల నిధులను సర్కార్ తాజాగా విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావడంతో ఇళ్ల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఈ వారపు నిధుల విడుదల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13,861 మంది లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేకూరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డిజిటల్ పద్ధతిలో ఈ నగదును బదిలీ చేశారు. సొంత ఇంటి కలను నిజం చేసుకునే క్రమంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి వారం క్రమం తప్పకుండా బిల్లులను క్లియర్ చేస్తూ వస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాలన్నింటినీ రాబోయే మార్చి నెల నాటికి పూర్తి చేసి, లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నందున, మార్చి కల్లా వేలాది కుటుంబాలు తమ నూతన గృహాల్లోకి ప్రవేశించేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను ముమ్మరం చేశారు.
ఇక ఈ పథకం అమలులో ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇళ్ల మంజూరు లేదా బిల్లుల విడుదల కోసం ఎవరైనా అధికారులు కానీ, ఇతరులు కానీ లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించింది. బాధితులు 1800 599 5991 అనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. లబ్ధిదారులు ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా కల్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa