ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కూడా జోరుగా కోడి పందేలు..! రూ.కోట్లల్లో బెట్టింగ్‌లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 15, 2026, 07:33 PM

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి కంటే కోడి పందాల జోరే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈసారి పందాల వేడి శిఖర స్థాయికి చేరింది. తెలంగాణలో పోలీసులు నిఘా పెంచడంతో.. పందెం రాయుళ్లు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాలకు క్యూ కట్టారు.


సరిహద్దుల్లో పందాల సందడి..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు ఈసారి కోడి పందాలకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, చీరవల్లి, శ్రీధర్ వేలేరు, వేలేరుపాడు మండలం మేడేపల్లి వంటి గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచే పందాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులే స్వయంగా ఈ పందాలను ప్రారంభించడం గమనార్హం.


మామిడి తోటలు, పామాయిల్ తోటలు పందెం వేదికలుగా మారిపోయాయి. రాత్రి వేళల్లో కూడా పందాలు నిర్వహించేందుకు ఫ్లడ్ లైట్లు, జనరేటర్లు సిద్ధం చేశారు. సంక్రాంతి సమయంలో కోడి పందాలు అనేది కేవలం వినోదం మాత్రమే కాదు.. దీని వెనుక ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. పందెం కోళ్లను పెంచడం ఒక ప్రత్యేక కళ. వీటికి బాదం, పిస్తా, జీడిపప్పు వంటి బలవర్ధకమైన ఆహారంతో పాటు మాంసాహారాన్ని కూడా ఇస్తుంటారు. ఒక్కో పందెం కోడి ధర వేల నుంచి లక్షల రూపాయల వరకు ఉంటుంది.


కోడి కాళ్లకు కట్టే కత్తులను ప్రత్యేకంగా తయారు చేస్తారు. వీటిని 'కోడి కత్తులు' అంటారు. ఈ కత్తులు ఎంత పదునుగా ఉంటాయంటే.. తగిలితే క్షణాల్లో ప్రత్యర్థి కోడి ప్రాణాలు కోల్పోతుంది. పందెం రాయుళ్ల కోసం నిర్వాహకులు ప్రత్యేకంగా విందులు, విలాసాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలోని భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల నుంచి వందల సంఖ్యలో కార్లలో ధనవంతులు, వ్యాపారులు ఏపీకి తరలివెళ్లారు. కోడి పందాలు జరిగే చోట కేవలం పందాలే కాకుండా పేకాట, గుండాట వంటి ఇతర జూదాలు కూడా జోరుగా సాగుతున్నాయి. దీని వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో పందెంలో లక్షల రూపాయలు ఓడిపోవడంతో చాలా కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నాయి. కొంతమంది తమ ఆస్తులను, భూములను కూడా అమ్మేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.


సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఈ జూదానికి బానిస అవుతున్నారు. ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జూదంలో సంపాదనంతా పోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. తెలంగాణ వైపు పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టినప్పటికీ.. పందెం రాయుళ్లు దొడ్డిదారిన సరిహద్దులు దాటుతున్నారు.


ఏపీ సరిహద్దుల్లో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు స్వేచ్ఛగా పందాలు నిర్వహిస్తున్నారు. ఇనుప తీగలతో కంచెలు వేసి, కేవలం డబ్బులు కాచే వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తూ రహస్యంగా వ్యవహారాలు నడుపుతున్నారు. ఒక్క రోజులోనే సరిహద్దుల్లో సుమారు రూ. 5 నుంచి 10 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా. సంప్రదాయం పేరుతో జరుగుతున్న ఈ జూదం వల్ల అనేక మంది సామాన్యులు వీధిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa