గ్రూప్-1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. ఈ కేసులో తుది తీర్పును ఫిబ్రవరి 5వ తేదీన వెల్లడించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం ప్రకటించింది. తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని, అందువల్ల వాయిదా వేస్తున్నట్లు కోర్టు పార్టీలకు తెలియజేసింది.ఈ అప్పీళ్లపై గత డిసెంబర్ 31న వాదనలు ముగించిన ధర్మాసనం, తీర్పును రిజర్వ్ చేసింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన ప్రక్రియలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ నమవరపు రాజేశ్వర్ రావు సెప్టెంబర్ 9న ఫలితాలు, ర్యాంకుల జాబితాను రద్దు చేశారు. జవాబు పత్రాలను మ్యాన్యువల్గా పునఃమూల్యాంకనం చేయాలని లేదా 8 నెలల్లోగా పరీక్షను తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించారు.సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎంపికైన కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్లో సవాలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం, సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది. ఫలితాల ఆధారంగా నియామక ప్రక్రియను కొనసాగించడానికి టీజీపీఎస్సీకి అనుమతి ఇచ్చింది. అయితే, ఈ నియామకాలు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని అప్పట్లో స్పష్టం చేసింది.ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో, టీజీపీఎస్సీ 563 పోస్టులకు గాను 562 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన ఈ మెయిన్స్ పరీక్షలకు దాదాపు 30,000 మంది హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa