ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారికంగా ప్రారంభం కాకముందే ప్రమాదాలకు నిలయంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు పనులు పూర్తికాకముందే వాహనాల రాకపోకలు పెరగడం, అతి వేగం కారణంగా వరుసగా ప్రాణనష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజా రక్షణను దృష్టిలో ఉంచుకుని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుక్రవారం స్వయంగా హైవే పరిస్థితులను సమీక్షించారు. వైరా నుంచి లింగాల వరకు హైవే మార్గంలో ప్రయాణించి, రహదారి భద్రతా లోపాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
కల్లూరు పోలీస్ స్టేషన్ను సందర్శించిన సీపీ, అక్కడ సిబ్బందితో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైవేపై జరుగుతున్న వరుస ప్రమాదాల పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రాణనష్టాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పోలీసులు అప్రమత్తంగా ఉండి, నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రమాదాల తీవ్రతను బట్టి బ్లాక్ స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అసంపూర్తిగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణం ఎంత ప్రమాదకరమో వాహనదారులకు అవగాహన కల్పించాలని సీపీ అధికారులను కోరారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో వెలుతురు లేకపోవడం, మలుపుల వద్ద సరైన సూచికలు లేకపోవడం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయని గుర్తించారు. పోలీస్ పెట్రోలింగ్ను పెంచాలని, అత్యవసర సమయాల్లో బాధితులకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు.
హైవే పనులు పూర్తిస్థాయిలో ముగిసి, అన్ని రకాల భద్రతా ప్రమాణాలు అందుబాటులోకి వచ్చే వరకు వాహనదారులు సంయమనం పాటించాలని ఈ పర్యటన ద్వారా సందేశం ఇచ్చారు. గ్రీన్ ఫీల్డ్ హైవేపై నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీపీ స్పష్టం చేశారు. కల్లూరు పోలీసు స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన ఆయన, శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సిబ్బందిని ఉత్సాహపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa