హైదరాబాద్ నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మెట్రో విస్తరణను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. ప్రాజెక్టు డీపీఆర్ను కేంద్రానికి పంపింది. అయితే పాతబస్తీలో మెట్రో విస్తరణకు మొదటి నుంచి అడ్డంకులు తలెత్తుతూనే ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఉన్న పురాతన వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని ఇప్పటికే పలువురు తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోర్టు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పాతబస్తీలో మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన ఒప్పందాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థను హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం మూడు వారాల గడువు ఇచ్చింది. ఆ అఫిడవిట్లో పాతబస్తీలో ఉన్న వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను కూడా చేర్చాలని తెలిపింది.
పాతబస్తీలో మెట్రో విస్తరణ చేయడం వల్ల అక్కడ ఉన్న చారిత్రక పురాతన కట్టడాలు దెబ్బతింటున్నాయని యాక్ట్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ చేపట్టింది.
ఇక హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. మెట్రో విస్తరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణ కోసం కేవలం 3 పురాతన కట్టడాలను కూల్చివేయాల్సి ఉంటుందని కోర్టుకు విన్నవించారు. దాని కోసం ఇప్పటికే సంబంధిత శాఖకు దరఖాస్తు చేసిన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం పాతబస్తీలో నిర్మించనున్న మెట్రో నిర్మాణం కోసం.. ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. నిబంధనల ప్రకారమే అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయిస్తామని కోర్టుకు తెలిపారు.
అయితే పాతబస్తీ మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటిదాకా వారసత్వ కట్టడాల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేయలేదని పిటిషనర్ తరఫు లాయర్ రామారావు కోర్టుకు వెల్లడించారు. దానిపై స్పందించిన ఏఏజీ ఇమ్రాన్ ఖాన్.. కమిటీ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాధానం ఇచ్చారు. రెండు వైపులా వాదనలు విన్న హైకోర్టు సీజే బెంచ్.. మెట్రో నిర్మాణంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మెట్రో నిర్మాణ సంస్థను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa