తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. పార్టీలన్నీ ప్రచారంపై మరింత దృష్టి పెట్టాయి. ఈ సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ .. సిరిసిల్ల పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. సిరిసిల్ల సీఐ క్రిష్ణ ఓవరాక్షన్ చేస్తున్నారని.. బీజేపీ సిబ్బంది, నాయకులపై దాడి చేశారని పేర్కొన్న బండి సంజయ్.. వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. బీజేపీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతుంటేయయ ఆయనకు పోలీసులు మద్దతు పలుకుతారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తాము చేస్తున్న విజ్ఞప్తులను చేతగానితనంగా భావిస్తున్నారా అని పోలీసులను ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని లేదా అని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. సిరిసిల్ల సీఐ క్రిష్ణ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే.. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. తక్షణమే ఆ సీఐ క్రిష్ణను విధుల్లోంచి తప్పించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బండి సంజయ్ హెచ్చరించారు.
సిరిసిల్ల పోలీసులు వారి పద్దతిని మార్చుకోకుంటే తాను వేములవాడలోనే కూర్చుంటానని తేల్చి చెప్పారు. డీజీపీ, జిల్లా ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందంటూ పోలీసులను బండి సంజయ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం చేసిన కేంద్రమంత్రి.. వేములవాడ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే.. కేంద్రమంత్రిగా తాను తీసుకువస్తున్నాని.. అలాంటప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఓట్లు వేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500.. కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం.. విద్యార్థినులకు స్కూటీ ఇచ్చారా అని నిలదీశారు. పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ అమలు అవుతోందా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారా.. నిరుద్యోగ భృతి ఇచ్చారా అని నిలదీశారు.
గతంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇస్తే కమీషన్ల కింద పూర్తిగా దండుకున్నారని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల ముందుకు వస్తున్నాయని.. వారికి ఓట్లు ఎందుకు వేయాలని ఆ రెండు పార్టీలను నిలదీయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa