డిజిటల్ అరెస్ట్ పేరుతో నగరానికి చెందిన ఒక వ్యక్తిని భయపెట్టి రూ.1.07 కోట్లు కాజేసిన సైబర్ మోసంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ వి. అరవింద్ బాబు తెలిపారు. నిందితులు ఢిల్లీకి చెందినవారని, వీరు మోసగాళ్లకు బ్యాంకు ఖాతాలను సరఫరా చేస్తూ ఈ నేరానికి సహకరించారని ఆయన వెల్లడించారు.ఇటీవల నగరానికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని పరిచయం చేసుకున్నారు. అతని ఆధార్ కార్డు, ఫోన్ నంబర్పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. విచారణ పేరుతో "డిజిటల్ అరెస్ట్" చేసి, పలు దఫాలుగా రూ.1.07 కోట్లను వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, డబ్బు బదిలీ అయిన ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మొదట దీపక్, ప్రశాంత్ కుమార్ అనే ఇద్దరు ఖాతాదారులను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో, ఈ మోసానికి బ్యాంకు ఖాతాలను సరఫరా చేస్తున్న ప్రధాన సూత్రధారులు గుర్దీప్ సింగ్, హర్ప్రీత్ సింగ్, కుమార్ మోహిత్లను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఢిల్లీ, జైపూర్ వంటి నగరాల్లోని హోటళ్లలో ఉంటూ, డబ్బు అవసరం ఉన్నవారికి కమీషన్ ఆశ చూపి వారి బ్యాంకు ఖాతాలను సేకరించి మోసాలకు వాడుతున్నట్లు తేలింది. వీరికి గుజరాత్, కేరళ, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో జరిగిన సైబర్ నేరాలతోనూ సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ సందర్భంగా డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ, "అపరిచితులకు కమీషన్ ఆశతో బ్యాంకు ఖాతాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, ఆధార్ వంటివి ఎవరితోనూ పంచుకోవద్దు" అని ప్రజలను హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa