ప్రపంచ దేశాల్లో ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిని అంచనా వేసే అవినీతి గ్రహణ సూచీ (సీపీఐ) 2025లో భారత్ తన స్థానాన్ని స్వల్పంగా మెరుగుపరుచుకుంది. బెర్లిన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ సంస్థ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసిన ఈ నివేదికలో 182 దేశాల జాబితాలో భారత్ 39 స్కోరుతో 91వ స్థానంలో నిలిచింది. గత ఏడాది (2024) 96వ ర్యాంకులో ఉన్న భారత్, ఈసారి ఐదు స్థానాలు ముందుకు రావడం గమనార్హం.ఈ సూచీలో 100 స్కోరు ఉంటే అవినీతి లేనట్లు, 0 స్కోరు ఉంటే తీవ్ర అవినీతి ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ఏడాది ప్రపంచ సగటు స్కోరు 42 కాగా, ఆసియా-పసిఫిక్ ప్రాంత సగటు స్కోరు 45గా నమోదైంది. ఈ రెండు సగటుల కంటే భారత్ స్కోరు తక్కువగా ఉండటం గమనార్హం.ఆసియా-పసిఫిక్ రీజియన్లో అవినీతి నిరోధక చర్యల పురోగతి చాలా నెమ్మదిగా ఉందని, గత దశాబ్ద కాలంగా పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదని నివేదిక పేర్కొంది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి దేశాల్లో ప్రభుత్వాల పనితీరు, అవినీతిపై ప్రజాగ్రహం పెరిగి నిరసనలకు దారితీసినట్లు తెలిపింది. "ఈ ప్రాంతంలోని చాలా దేశాల్లో బలహీనమైన చట్టాలు, జవాబుదారీతనం లేని నాయకత్వం, రాజకీయ నిధుల్లో పారదర్శకత లోపించడం సుపరిపాలనను దెబ్బతీస్తున్నాయి" అని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్ సలహాదారు ఇల్హామ్ మొహమ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa