తిరుపతి రూరల్ మండల పరిధిలోని తుమ్మలగుంట గ్రామంలో వెలసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిర్వహిస్తున్న స్నపన తిరుమంజనం (పవిత్రస్నానం) శోభాయమానంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బుధవారం ఉదయం 10. 30 నుండి 11. 30 గంటల వరకు ఆలయంలోని కల్యాణ మండపంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
ప్రధాన కంకణభట్టర్ గిరిధర్ భట్టాచార్యులు ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం (కొబ్బరినీళ్లు), హరిత్రోదకం (పసుపు), గంధోధకం (గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖధార, చక్రధార, సహస్రధార, మహా కుంభాభిషేకాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్య ప్రభందములోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో వివిధ రకాల సాంప్రదాయ పూలు, రోజా పూలు, సంపంగి, చామంతి, తులసి, గులాబి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లక్ష్మీ దంపతులు, ఆలయ ఈవో సుబ్రమణ్యం రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa