తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్లో తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5.10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 5.50 గంటలకు 1 జన్ పథ్ నివాసానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఢిల్లీలోని సహద్ర ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్డీయే భాగస్వామిగా ఆయన బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో పర్యటించి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు కూటమి ఎంపీలను ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. ఇటీవల ఉండవల్లిలో జరిగిన ఎంపీల సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. ఓట్ల లెక్కింపును 8వ తేదీన నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.