ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఫిబ్రవరి 29వ తేదీ మౌని అమావాస్య రోజు వేకువజామున తొక్కిసలాట జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో మొత్తం 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు యూపీ సర్కారు వెల్లడించింది. అయితే ఈ ఘటనకు కారణం యూపీ ప్రభుత్వ అధికారులే అంటూ ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఆ పిల్ను తిరస్కరించింది. ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలంటూ పిటిషనర్కు సూచించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఫిబ్రవరి 29వ తేదీన మౌని అమావాస్య సందర్భంగా.. ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వచ్చారు. వేకువజాము నుంచే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు కుప్పలు తెప్పలుగా వెళ్లారు. అయితే చీకటిగా ఉండడం, చెత్త డబ్బాలు అడ్డుగా ఉండడంతో అవి కనిపించక కొంత మంది భక్తులు కింద పడిపోయారు. అది గమనించికుండా వెళ్లి మరికొంత మంది భక్తులు వారిపై పడగా.. తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో మొత్తం 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు కారణం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమేనని.. సర్కారు అధికారులే దీనిపై బాధ్యత వహించాలంటూ విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధాన పరమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కోరారు. అలాగే భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా ఉండేందుకు వీఐపీ ట్రీట్మెంట్ను రద్దు చేయాలని సూచించారు.
అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలంటూ సుప్రీం సూచన
తాజాగా దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈఘటనపై ఇప్పటికే జ్యూడీషియల్ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ఇలాంటి ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యమే హైకోర్టులో కూడా దాఖలు అయిందని వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఆందోళన కల్గించే అంశమని చెప్పుకొచ్చింది. ఈక్రమంలోనే ఈ పిల్ను తిరస్కరించి.. పిటిషనర్ను అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.