పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వెంటనే స్టైఫండ్ను పెంచి న్యాయం చేయాలంటూ పశువైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రొద్దుటూరు పరిధిలోని గోపవరం పంచాయతీలో ఉన్న వెటర్నరీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఎదుట విద్యార్థి నాయకుడు శివతరుణ్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013 నుంచి ఇప్పటి వరకు తమకు స్టైఫండ్ కింద కేవలం రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. నిత్యావసర ధరలు పెరిగినా స్టైఫండ్ మాత్రం పెరగలేదని వాపోయారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా తాము కూడా ఐదున్నర సంవత్సరాలు చదువుతున్నామని పేర్కొన్నారు. మెడికల్ విద్యార్థులకు ఇంటర్న్షిప్లో రూ.26 వేలు ఇస్తున్నారని, వెటర్నరీ ఇంటర్న్షిప్ కూడా వారితో సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.