ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైకి బిచ్చగత్తె, ఇంట్లోకి వెళ్లి చూస్తే పోలీసులే షాక్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 09:13 PM

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలో పోలీసులు.. ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు నిర్వహించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్తా, అల్లుడు కలిసి.. ఆ ప్రాంతంలో చోరీలకు పాల్పడుతూ భారీగా డబ్బు, ఇతర వస్తువులు కనిపించడంతో పోలీసులకు షాక్ అయ్యారు. ఆమె ఇంట్లో కేటీఎం బైక్, విలువైన సెల్‌ఫోన్లు, పలు దేశాలకు చెందిన నాణేలు, ఇతర విలువైన వస్తువులు చూసి అవాక్కయ్యారు. అయితే ఆ మహిళ నిత్యం ఇళ్లలోకి వెళ్లి అడుక్కుంటుందని.. ఆమె బిచ్చగత్తెగా పైకి కనిపిస్తూనే రెక్కీ నిర్వహిస్తోందని.. ఆ సమాచారాన్ని తన అల్లుడితో పంచుకోగా.. అతడు వెళ్లి చోరీలకు పాల్పడతాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు. దీంతో ఆ బిచ్చగత్తెను పోలీసులు అరెస్ట్ చేయగా.. అతడి అల్లుడు పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


ముజఫర్‌పూర్ జిల్లా రూరల్ ఎస్పీ విద్యాసాగర్.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నీలందేవి అనే మహిళ.. స్థానికంగా ఇంటింటికీ తిరుగుతూ బిచ్చం ఎత్తుకునేది. కొన్నిసార్లు ఇంటింటికీ వెళ్లి దోమ తెరలు విక్రయించేది. ఇలాంటి సమయంలోనే జనం తక్కువగా ఉండే ఇళ్లు, తాళాలు వేసి ఉన్న ఇళ్లను చూసి తన అల్లుడు చుటుక్ లాల్‌కు సమాచారం అందించేది. చుతుక్ లాల్ వచ్చి.. ఆ ఇళ్లను దోచుకునే వారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఇటీవలి కాలంలో దొంగతనాలు ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.


అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. నీలందేవి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో ఆమెను గుర్తించి.. ఏకంగా ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో పోలీసులకు షాక్ అయ్యే విషయాలు తెలిశాయి. నీలం దేవి ఇంట్లో విలువైన కేటీఎం బైక్.. ఖరీదైన 12 మొబైల్ ఫోన్లు దొరికాయి. అంతేకాకుండా ఒక బంగారం చైన్, ఇతర ఆభరణాలు లభించాయి. వీటితోపాటు నేపాల్, ఆఫ్ఘనిస్థాన్‌, కువైట్ వంటి దేశాలకు చెందిన వెండి నాణేలు.. బ్రిటీష్‌ కాలం నాటి నాణేలు దొరకడంతో పోలీసులు షాక్‌ అయ్యారు. అనంతరం వాటిన్నంటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నీలందేవిని అరెస్ట్ చేశారు.


నీలం దేవిని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో పోలీసులు ప్రశ్నించగా.. అసలు విషయాలు వెల్లడించింది. బిచ్చం ఎత్తుకునే నెపంతో తాను రెక్కీ నిర్వహించి.. తాళాలు వేసి ఉన్న ఇళ్లు.. ఎవరూ ఎక్కువగా లేని ఇళ్లను గుర్తించి.. ఆ విషయాన్ని తన అల్లుడు చుతుక్ లాల్‌కు చెప్పారని అంగీకరించింది. చుతుక్ లాల్ తన అనుచరులతో కలిసి ఆయా ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఆమె చెప్పినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె అల్లుడు చుతుక్ లాల్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అతడి అరెస్ట్‌ తర్వాత మిగతా నిందితులు ఎవరన్నది తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com