భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మంగళవారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా డివిడెండ్ చెల్లిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఐఆర్సీటీసీ బంపర్ లాభాలను అందుకుంది. స్టాండలోన్ ప్రాతిపదికన ఐఆర్సీటీసీకి రూ.341 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.300 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది సమీక్షా త్రైమాసికంలో లాభం 14 శఆతం పెరిగి రూ.341 కోట్లుగా నమోదైంది.
అలాగే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 మూడో త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం సైతం 10 శాతం మేర పెరిగింది. రూ.1225 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో చూస్తే కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.1115 కోట్లుగా ఉంది. డిసెంబర్ 31తో ముగిసిన సమీక్షా త్రైమాసికంలో పన్ను తర్వాత లాభం (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) 11 శాతం పెరిగి రూ.308 కోట్లకు చేరినట్లు ఐఆర్సీటీసీ వెల్లడించింది. క్యాటరింగ్ వ్యాపారం ద్వారా ఐఆర్సీటీసీకి వచ్చే ఆదాయం రూ.555 కోట్లుగా ఉంది. రైల్ నీర్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.96 కోట్లుగా ఉండగా, ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ ద్వారా వచ్చే ఆదాయం రూ.354 కోట్లుగా ఉందని తెలిపింది. టూరిజం విభాగంలో రూ.224 కోట్లు ఆదాయం వచ్చినట్లు కంపెనీ తెలిపింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది ఐఆర్సీటీసీ. తమ షేర్ హోల్డర్లకు అదిరే శుభవార్త అందించింది. ఒక్కో షేరుకు రూ.3 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. అయితే, అర్హులైన షేర్ హోల్డర్లను గుర్తించేందుకు రికార్డ్ తేదీని ప్రకటించలేదు. ఈ విషయంపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. అలాగే ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ముగిసే సమయానికి ఐఆర్సీటీసీ షేర్లు 3.05 శాతం మేర నష్టంతో రూ. 750.10 వద్ద ముగిశాయి.
![]() |
![]() |