ఈ నెల 12 నుంచి 16 వరకు చేసే బుకింగ్ లకు మాత్రమే ఈ ఆఫర్ ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగో వాలంటైన్స్ డే సేల్ ను తీసుకొచ్చింది. ఈ సేల్ ద్వారా విమాన టికెట్ల బుకింగ్స్ పై ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. అయితే, ఇద్దరు ప్రయాణికులకు కలిపి టికెట్ బుక్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో తెలిపింది. అలాగే ఈ నెల 12 నుంచి 16 వరకు చేసే బుకింగ్ లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. బుకింగ్ తేదీకి, జర్నీ డేట్కు మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలని వెల్లడించింది. టికెట్ ధరతో పాటు ప్రయాణికులు ట్రావెల్ యాడ్ ఆన్స్పైనా డిస్కౌంట్లను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఇక అదనపు బ్యాగేజీ అంశంలో ముందస్తు బుకింగ్ పై 15 శాతం, సీట్ల ఎంపికపై 15 శాతం, ముందస్తుగా బుక్ చేసే మీల్స్ పై 10 శాతం తగ్గింపును ఇస్తామని ఇండిగో తెలిపింది. సంస్థ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, ఇండిగో 6ఈ ఏఐ చాట్బాట్, ఎంపిక చేసిన ట్రావెల్ పార్ట్నర్స్ వేదికగా టికెట్ బుక్ చేసినప్పుడు ఈ ఆఫర్ పొందవచ్చని తెలిపింది. అలాగే ఇండిగో ఫిబ్రవరి 14న మరో ఫ్లాష్ సేల్ నిర్వహించనుంది. సంస్థ అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా చేసే తొలి 500 బుకింగ్స్ పై అదనంగా 10 శాతం తగ్గింపును ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీన్ని 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 11.59 గంటల మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది.
![]() |
![]() |