ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్లో పాకిస్థాన్కు పరాభవం ఎదురైంది. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్ ఫైనల్లో ఆతిథ్య పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈ సిరీస్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. కరాచీ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 14) జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటమి అనేది లేకుండా ట్రై సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కనీసం 50 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ (46) టాప్ స్కోరర్. సల్మాన్ అఘా (45), తయ్యబ్ తాహిర్ (38) కూడా రాణించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఒరుర్కే 4 వికెట్లతో సత్తా చాటాడు. మైకేల్ బ్రేస్వెల్ 2, మిచెల్ శాంట్నర్ 2, నాథన్ స్మిత్ 1 , జాకబ్ 1 వికెట్ తీశారు.
అనంతరం మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ను పాక్ బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు కొడుతూ న్యూజిలాండ్ బ్యాటర్లు తమ జట్టును లక్ష్యానికి చేరువచేశారు. బ్యాటర్లంతా సమష్టిగా రాణించడంతో కివీస్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డేరిల్ మిచెల్ (57), టామ్ లేథమ్ (56), డెవాన్ కాన్వే (48,), కేన్ విలియమ్సన్ (4) రాణించారు.
ఇక ఈ ట్రై సిరీస్లో పాకిస్థాన్, న్యూజిలాండ్తో పాటు.. దక్షిణాఫ్రికా కూడా పాల్గొంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి.. ఆ జట్టు ఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. హ్యాట్రిక్ విజయాలు సాధించిన న్యూజిలాండ్ టైటిల్ సాధించింది. ఈ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరిగింది. ఇక ఇక్కడే మరో 5 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే భారత్ ఆడే మ్యాచులు మాత్రం దుబాయ్ వేదికగా జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై జరిగిన ట్రై సిరీస్లో విజేతగా నిలవకపోవడం పట్ల పాకిస్థాన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |