ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క ప్రకటనతో.. రూ. 26 లక్షల కోట్లు కుమ్మరించారు

business |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 10:18 PM

 డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయమూ సంచలనమే. వచ్చీరాగానే.. మెక్సికో, కెనడా, చైనా వంటి దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాల్ని ప్రకటించారు. ఇంకా తమపై సుంకాలు విధించే ప్రతి దేశంపైనా ప్రతిసుంకాలు విధిస్తానని అన్నారు. ఇంకా ఇలాగే ప్రతి అంశంలోనూ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆర్థిక అనిశ్చితి, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా.. స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయి.. ద్రవ్యోల్బణం పెరుగుతోంది.. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి.. చమురు ధరలు పెరుగుతున్నాయి.. ఇంకా క్రిప్టో మార్కెట్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ట్రంప్ గెలిచిన తర్వాత క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ భారీ ర్యాలీ చేసి లక్ష డాలర్ల మార్కును దాటడం విశేషం.


ఇక ట్రంప్ తొలినుంచీ.. క్రిప్టో అనుకూల వైఖరిని అవలంబిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేశారు. ఆదివారం రాత్రి ట్రంప్.. 5 క్రిప్టో కరెన్సీలను అమెరికా వ్యూహాత్మక రిజర్వ్స్‌గా ఉంచాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రెసిడెన్షియల్ వర్కింగ్ గ్రూప్ క్రిప్టో వ్యూహాత్మక రిజర్వుల్ని ఏర్పాటు చేసేలా పనిచేయాలని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్ డాలర్లను (భారత కరెన్సీలో సుమారు రూ. 26 లక్షల కోట్లు) చొప్పించేలా చేసింది. అంటే ఆ మేరకు క్రిప్టో మార్కెట్లోకి నిధుల ప్రవాహం పెరిగిందన్నమాట.


ముందుగా ఈ వ్యూహాత్మక రిజర్వుల్లో ఎక్స్‌ఆర్‌పీ, ఏడీఏ (కార్డనో), ఎస్‌వోఎల్ (సోలాన) క్రిప్టో కరెన్సీలను చేర్చాలని చెప్పగా.. కాసేపటికి బిట్ కాయిన్, ఏథర్‌ను కూడా చేర్చాలని పోస్ట్ చేశారు. గతంలో ట్రంప్ ఇలా క్రిప్టోలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసినా.. కాయిన్ల పేర్లు ప్రస్తావించలేదు. ఇప్పుడు మాత్రం వాటి గురించి చెప్పారు.


ఈ నేపథ్యంలోనే ట్రంప్ ప్రకటనతో.. 5 క్రిప్టో కరెన్సీల విలువ భారీగా దూసుకెళ్లింది. అయితే క్రిప్టో కరెన్సీల్ని అమెరికా డిజిటల్‌గా ఎలా నిల్వ చేస్తుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ట్రంప్ ప్రకటన తర్వాత బిట్ కాయిన్, ఏథర్ విలువ ఏకంగా 10 శాతానికిపైగా పెరగ్గా.. మిగతావి 60 శాతానికిపైగా పెరగడం విశేషం. వాస్తవానికి బిట్ కాయిన్ ధర ట్రంప్ గెలిచిన సమయంలో భారీగా పెరగ్గా.. ఇటీవల జనవరి, ఫిబ్రవరిలో తగ్గి ఒక దశలో 80 వేల డాలర్ల దిగువకు కూడా పడిపోగా.. ఇప్పుడు అది మళ్లీ 92 వేల డాలర్ల వద్దకు చేరింది. ఇది భారత కరెన్సీలో రూ. 80 లక్షలకుపైనే ఉంటుంది. గత 5 రోజుల్లోనే ఒక్కో బిట్ కాయిన్ ధర రూ. 7 లక్షలకుపైగా పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa