మహిళల ప్రీమియర్ లీగ్ 2025 తుది అంకానికి చేరుకుంది. నెలరోజుల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ టోర్నీలో నేడు ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్లో ఇది మూడో సీజన్ కాగా.. తొలి సీజన్లో ముంబై ఇండియన్స్, రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించింది. మరి మూడోసారి కొత్త విజేతను చూస్తామా? లేదా ముంబై ఇండియన్స్ తన ఖాతాలో రెండో టైటిల్ను వేసుకుంటుందా? అన్నది తేలాల్సి ఉంది.
ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఢిల్లీ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ముంబై మాత్రం గత మ్యాచ్లో ఆడిన టీమ్తోనే బరిలోకి దిగింది.
కాగా డబ్ల్యూపీఎల్ 2023 సీజన్లోనూ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆరంభ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి.. ముంబై విజేతగా నిలిచింది. ఇక రెండోసీజన్లోనూ ఢిల్లీ ఫైనల్ చేరింది. టోర్నీ ఆసాంతం అదిరే ప్రదర్శన చేసి.. తుది పోరుకు అర్హత సాధించింది. అయితే వరుసగా రెండోసారి ఆ జట్టుకు నిరాశే ఎదురైంది. ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. దీంతో వరుసగా రెండోసారి ఫైనల్ చేరినా.. ఆ జట్టు ఓటమిపాలైంది.
ఇక పట్టుదల వదలకుండా వరుసగా మూడోసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ చేరింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి.. నేరుగా ఫైనల్ చేరింది. దీంతో ఈ లీగ్లో ఆడిన మూడుసార్లు ఫైనల్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. మరి తొలి రెండు సీజన్లలో ఫైనల్లో బోల్తా కొట్టి.. టైటిల్కు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారైనా గెలుపుగీతను దాటుతుందా? ఛాంపియన్లతో నిండిన ముంబై రెండోసారి టైటిల్ దక్కించుకుంటుందా? అన్నది మరో మూడు గంటల్లో తేలిపోనుంది.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్:
యాస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవియర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), సజీవన్ సజన, అమేలియా కేర్, అనమ్జోత్ కౌర్, జి.కమలిని, సంస్క్రిత గుప్తా, ఇస్మాయిల్, సైకా ఇషాక్
ఢిల్లీ క్యాపిటల్స్:
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెస్ జోనాసెన్, జెమీమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, మరిజన్నే కాప్, సారా బ్రైస్, నికీ ప్రసాద్, మిన్ను మని, శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి
![]() |
![]() |