ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు గ్రాముకు రూ. 2943.. ఇప్పుడు రూ. 8624,,,బంగారంపై మూడింతల రిటర్న్స్

business |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 10:42 PM

కేంద్ర ప్రభుత్వం లాంఛ్ చేసిన ఎన్నో గొప్ప పథకాల్లో సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఒకటి. ఇక్కడ బంగారంపై ఆన్‌లైన్‌లోనే ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఇక్కడ 8 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. అవసరమైతే.. ఐదేళ్ల తర్వాత కూడా ముందస్తుగా ఉపసంహరించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ గోల్డ్ బాండ్లు జారీ చేస్తుంటుంది. ఇక గతంలో ఒక దశలో ప్రతి నెలలో గోల్డ్ బాండ్లను జారీ చేసేది.. తర్వాత ప్రతి త్రైమాసికానికి ఒకసారి జారీ చేసేది. ఐదేళ్ల దాటిన తర్వాత లేదా 8 ఏళ్ల తర్వాత పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. ఇక ముందుచూపుతో 8 సంవత్సరాల కిందట గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు జాక్‌పాట్ తగిలిందని చెప్పొచ్చు. 2016-17 సిరీస్- IV బాండ్లకు సంబంధించి.. తాజాగా రిడెంప్షన్ ప్రైస్, డేట్‌ను ఆర్బీఐ ప్రకటించింది.


ఈ మార్చి 17 మెచ్యూర్ తేదీగా ప్రకటించింది. ఈ క్రమంలోనే అప్పట్లో ఈ సిరీస్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి బంపర్ రిటర్న్స్ వచ్చాయి. ఏకంగా మూడింతల లాభం వచ్చిందని చెప్పొచ్చు. మన దేశంలో భౌతిక బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న ఉద్దేశంతోనే 2015 నవంబర్ నెలలో ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను తీసుకొచ్చింది. 2017 మార్చి సమయంలో జారీ చేసిన నాలుగో విడత బాండ్స్ ధరను.. ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.


అప్పట్లో గోల్డ్ బాండ్లను గ్రాముకు రూ. 2943 చొప్పున ఇష్యూ చేయగా.. ఇప్పుడు గ్రాముకు రూ. 8624 రిడెంప్షన్ ధరను ప్రకటించింది. ఈ క్రమంలోనే కళ్లుచెదిరే రిటర్న్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసినట్లయితే.. అప్పట్లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే గ్రాముకు రూ. 2943 చొప్పున.. 33.97 గ్రాముల బంగారం వచ్చేది. ఇక ఇప్పుడు అదే రూ. 8624 చొప్పున ఆ లక్ష పెట్టుబడి ఇప్పుడు రూ. 2.93 లక్షల అయ్యుండేది. ఇంకా గోల్డ్ బాండ్లపై ఏటా కేంద్రం వడ్డీ రేటు చెల్లిస్తుంటుంది. ఈ సిరీస్‌పై అప్పట్లో 2.50 శాతం వడ్డీ రేటు ప్రకటించగా.. ఇంకా ఎక్కువే రిటర్న్స్ వచ్చుంటాయని చెప్పొచ్చు. ఇది రూ. 3 లక్షలు దాటుతుంది.


ఇక గ్రాము ధరను నిర్ణయించేందుకు ఇష్యూ సమయంలో ముందు వారం చివరి 3 రోజుల సగటు ధరను ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ నిర్ణయిస్తుంది. దీనినే ఆర్బీఐ ఖరారు చేస్తుంది. గతంలో రెగ్యులర్‌గా ఈ బాండ్లను జారీ చేయగా.. ఇప్పుడు జారీ చేయట్లేదు. చివరిసారిగా 2024 ఫిబ్రవరిలో సబ్‌స్క్రిప్షన్‌కు తీసుకురాగా.. తర్వాత ఆ ఊసే లేదు. ఈ బాండ్ల జారీ వల్ల కేంద్రానికి రుణ భారం ఎక్కువవుతుందని కొద్ది రోజుల కిందట కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్వయంగా చెప్పారు. దాదాపుగా వీటిని నిలిపివేసినట్లేనని తెలుస్తోంది. గతంలో ఇష్యూ చేసిన వాటికి సంబంధించి.. బడ్జెట్‌లో నిధుల్ని కేటాయిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com