భార్య, ముగ్గురు పిలల్లపై ఓ బీజేపీ నేత దారుణంగా కాల్పులు జరిపాడు. ఆపై ఆయనే నేరుగా పోలీసులకు ఫోన్ చేసి కుటుంబ సభ్యులను కాల్చినట్లు వివరించాడు. షాకైన పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. వారు వచ్చే సరికి ఓ కుమారుడు, కుమార్తె ప్రాణాలు కోల్పోగా.. భార్య, మరో కుమారుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. విషయం గుర్తించిన పోలీసులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతుండగా.. పోలీసులు బీజేపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఉత్తర ప్రదేశ్లోని సహారాన్ పూర్ జిల్లా సంగతేడ గ్రామానికి చెందిన బీజేపీ కార్యవర్గ సభ్యుడు యోగేష్ రోహిల్లా శనివారం రోజు దారుణానికి పాల్పడ్డారు. ఎవరూ ఊహించని విధంగా.. ఇంట్లోనే భార్యా, ముగ్గురు పిల్లలపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో వారంతా అక్కడికక్కడే కుప్పకూలిపోగా చనిపోయారని భావించిన అతడు పోలీసులకు ఫోన్ చేశాడు. భార్య, ముగ్గురు పిల్లలపై కాల్పులు జరిపానని వివరించాడు. యోగేష్ రోహిల్లా చెప్పిందంతా విని షాక్ అయిన పోలీసులు.. ఆయన ఇంటికి వెళ్తే అసలు విషయం తెలుస్తుంది కదా అని అక్కడకు వెళ్లారు.
ఈక్రమంలోనే ఒక కుమారుడు, 11 ఏళ్ల వయసు కల్గిన కుమార్తె ప్రాణాలు కోల్పోయి కనిపించారు. వారిద్దరి మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉండగా... భార్య, మరో కుమారుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో పోలీసులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అలాగే చనిపోయిన కుమార్తె, కుమారుడి మృతదేహాలను.. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు. ఆపై యోగేష్ రోహిల్లాను అరెస్ట్ చేసి.. ఆయన కాల్పులు జరిపేందుకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
అయితే యోగేష్ రోహిల్లాకు భార్య క్యారెక్టర్పై చాలా కాలంగా అనుమానం ఉండగా.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు యోగేష్ మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని.. కాల్పులు ఎందుకు జరిపాడనే దానిపై కారణాలు చెప్పలేకపోతున్నాడని వివరించారు. అయితే ఈ కాల్పులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
![]() |
![]() |