ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాల తలసరి ఆదాయంలో.. కరవు ప్రాంతమైన అనంతపురం ముందు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 05:48 PM

ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి వ్యూహాత్మక రంగాలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లా, పచ్చని కోనసీమ జిల్లాను తలదన్నేలా అధిక తలసరి ఆదాయం సాధించిందని ఆయన తెలిపారు. జిల్లాల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఈ విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా ఆర్థికాభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఒక రంగంపై ప్రత్యేక దృష్టి పెడితే ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించవచ్చనేదీ అనంతపురం జిల్లా నిరూపించిందని అన్నారు. ఒకప్పుడు కరువుతో వెనుకబడిన జిల్లాగా ఉన్న అనంతపురం, ఉద్యానవన రంగంపై దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు కోనసీమ కంటే ఎక్కువ తలసరి ఆదాయం పొందుతోందని చంద్రబాబు వివరించారు.


2022-23 సంవత్సరంలో శ్రీ సత్యసాయి జిల్లా తలసరి ఆదాయం రూ. 2,19,234 గా ఉండగా, అనంతపురం జిల్లాలో రూ. 2,33,521 గా ఉందన్నారు. కోనసీమ జిల్లాలో రూ. 1,93,763 గా నమోదైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. "సాధారణంగా అనంతపురం కరవు ప్రాంతం. వెనుకబడిన జిల్లాగా పరిగణిస్తారు. కోనసీమ జిల్లాలో ఎక్కువ తలసరి ఆదాయం ఉంటుందని భావిస్తారు. కానీ, ఉద్యానవన రంగంలో గణనీయమైన వృద్ధి అనంతపురాన్ని ముందుకు నడిపించింది" అని చంద్రబాబు అన్నారు.


అభివృద్ధి చెందిన జిల్లాలు అనుసరించే ఉత్తమ విధానాలను వెనుకబడిన జిల్లాలు అనుసరించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో విజయవంతమైన వ్యూహాలను.. వెనుకబడిన జిల్లాలలో అమలు చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన స్థూల విలువ ఆధారిత అంచనాలలో మార్పులను కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా తయారీ, వ్యవసాయం, సేవల రంగాల కంటే పశుసంవర్ధన, ఉద్యానవన రంగాలు రాష్ట్ర స్థూల విలువఆధారిత అంచనాలకు ఎక్కువగా దోహదం చేస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధి ఉన్న ఈ రంగాలపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా పశుసంవర్ధన రంగం ఎక్కువ ఆదాయాన్ని సృష్టించడమే కాకుండా విస్తృతమైన ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు కూడా చిత్తశుద్ధితో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com