భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమేడియన్ కునాల్ కమ్రా వేసిన జోకులను ఉటంకిస్తూ యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో కొందరు దేశాన్ని ముక్కలు చేయడం, విభజనను విస్తృతం చేయడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారు’ అని యోగి మండిపడ్డారు. ముంబయిలో ఆదివారం జరిగిన ఓ షోలో కునాల్ కమ్రా.. ఏక్నాథ్ షిండేను ద్రోహి అంటూ జోకులు పేల్చడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తాను క్షమాపణ చెప్పేది లేదని, ఒకవేళ కోర్టు తాను తప్పుచేశానని ఆదేశిస్తే చెబుతానని కునాల్ కమ్రా స్పష్టం చేశారు. తనకు 500కిపైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిపారు.
ఇక, ఏఎన్ఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్పై యోగి ఆదిత్యనాథ్ పలు విమర్శలు గుప్పించారు. అమెరికా కుబేరుడు జార్జ్ సోరెస్ నుంచి తీసుకున్న డబ్బుతో 2024 లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. అలాగే, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కోటా బిల్లును తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిందని ధ్వజమెత్తారు. ‘లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఇండియా కూటమిలో పార్టీలు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా విదేశీ నగదును ఉపయోగించి ప్రభావితం చేసే ప్రయత్నం చేశాయి’ అని యోగి ఆరోపణలు చేశారు.
కాగా, కమేడియన్ కమ్రా.. ముంబయిలో ఆదివారం నిర్వహించిన షోలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఉద్దేశిస్తూ జోకులు పేల్చారు. ‘‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది.. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది.. అంతా గందరగోళంగా ఉంది’’ మరాఠా రాజకీయాల గురించి మాట్లాడారు. అలాగే, షిండే ద్రోహిగా అభివర్ణించించిన కునాల్.. ‘దిల్ తో పాగల్ హై’ అనే బాలీవుడ్ సినిమా పాటలోని చరణాలను రాజకీయాలను అనుగుణంగా మార్చి వ్యంగ్యంగా పాడారు.
![]() |
![]() |