ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెట్టింగ్ యాప్ కేసు.. ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 07:45 PM

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘేల్‌ అనేక కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో ఆయన ఇంట్లో ఈడీ సోదాలు చేయగా తాజాగా మరో కేసులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈయన హస్తం కూడా ఉందంటూ.. సీబీఐ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయ్‌పూర్, భిలాయిలోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. భూపేంద్ర బఘేల్‌తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.


2023లో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే దీనికంటే కొన్ని రోజుల ముందే మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని శుభమే సోనీ సంచలనం సృష్టించారు. ముఖ్యంగా అప్పట్లో సీఎంగా ఉన్న భూపేష్ బఘేల్‌యే ఈ యాప్ రూపొందించేందుకు తనను ప్రోత్సహించారని చెప్పారు. అలాగే దీనికోసం ఆయనకు రూ.508 కోట్లు చెల్లించానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఆరోపణలు సంచలనం రేపాయి. దాదాపు 6000 కోట్ల రూపాయల విలువ చేసే ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో భూపేష్ బఘేల్‌పై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఆ తర్వాత నుంచి సీబీఐ ఈ కేసును విచారిస్తోంది.


ఈక్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఇళ్లపై సోదాలు నిర్వహించింది. అయితే సీబీఐ అధికారులు ఏ కేసులో ఈ తనిఖీలు చేస్తున్నారనే దానిపై ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదు. కానీ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించే ఈ సోదాలు చేస్తున్నట్లు అంతా భావిస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం భూపేష్ బఘేల్ మాత్రం తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే కొందరు తనను టార్గెట్ చేసుకుని లేని పోని ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం కోసం తాను ఢిల్లీ వెళ్లబోతున్న సమయంలోనే సీబీఐ తమ నివాసానికి వచ్చి సోదాలు చేస్తోందని అన్నారు. కావాలనే బీజేపీ తనపై ఈ కుట్ర చేస్తూ దాడులు చేయిస్తుందని వ్యాఖ్యానించారు.


ఈ దాడులకు కొన్ని రోజుల ముందే భూపేష్ బఘేల్, ఆయన కుమారుడు చైనత్య నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. అప్పుడే వారి ఇంట్లో రూ.30 లక్షల నగదు, పలు పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా అధికారులు తిరిగి వెళ్తుండగా.. వారి వాహనాలపై కొందరు నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com