ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో మైనార్టీలపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయి..: అమెరికా తీవ్ర ఆరోపణలు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 07:46 PM

భారత దేశానికి చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)పై అమెరికా ఆంక్షలు విధించాలని చూస్తోంది. ముఖ్యంగా అక్కడి రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ "రా" పై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. గతేడాది కూడా మతపరమైన మైనార్టీలపై వేధింపులు, దాడులు తీవ్రంగా పెరిగాయని చెప్పింది. ఈక్రమంలోనే భారత దేశాన్ని మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా ప్రకటించాలని సూచించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


కెనడాలోని సిక్కు వేర్పాటు వాదులను భారత దేశం లక్ష్యంగా చేసుకుందంటూ.. 2023లో "ది యూస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్" అనే సంస్థ ఆరోపణలు చేసింది. ముఖ్యంగా మాజీ ఇంటిలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్.. ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నారని చెప్పింది. కానీ అతడు అమెరికాలోనే ఉంటూ ఇండియా సర్కారుకే బెదిరింపు సందేశాలు పంపిస్తున్నారు. కానీ ఇదేదీ పట్టించుకోని సదరు సంస్థ మాత్రం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే వస్తోంది.


అయితే తాజాగా భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)పై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ముఖ్యంగా అమెరికా రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ తన వార్షిక నివేదికను మంగళ వారం రోజు విడుదల చేసింది. ఇందులోనే ఇండియాపై అనేక ఆరోపణలు చేసింది. భారత దేశంలో మైనార్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. వారు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని వివరించింది.


గత సంవత్సరాల్లో లాగానే 2024వ ఏటలోనూ.. ఇండియాలో ఉన్న మతపరమైన మైనార్టీలపై పెద్ద ఎత్తున వేధింపులు జరిగాయని చెప్పింది. అలాగే అనేక మంది దాడులకు గురయ్యారని.. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతూ వస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంతటితో ఆగకుండా భారత దేశాన్ని మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా ప్రకటించాలని సూచించింది.


అలాగే వియత్నాంలోని కమ్యూనిస్ట్ పాలకులపై కూడా సదరు సంస్థ విమర్శలు చేసింది. మత వ్యవహారాలను ఆ దేశం కూడా నియంత్రిస్తోందంటూ నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా ఆ దేశాన్ని సైతం ఆందోళనకర జాబితాలో చేర్చాలని చెప్పింది. అయితే ఈ సంస్థ ఇచ్చిన నివేదికను, సూచనలను.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సర్కారు తప్పనిసరిగా పాటించాలన్న నిబంధన ఏమీ లేదు. ముఖ్యంగా చైనాను కట్టడి చేసేందుకు అమెరికా.. భారత్, వియత్నాంతో కలిసి పని చేస్తుండగా.. ఈ దేశాలపై ట్రంప్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోవచ్చనే నిపుణులు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com