ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ఆదాయపు పన్ను శ్లాబులు పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట

business |  Suryaa Desk  | Published : Sun, Apr 13, 2025, 10:29 PM

 కేంద్ర ప్రభుత్వం 2025 వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటనిచ్చేలా కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో చేసిన మార్పులు మధ్యతరగతి వారికి పెద్దమొత్తంలో ప్రయోజనం చేకూర్చనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం, ఇక మీదట వార్షిక ఆదాయం రూ. 12 లక్షల వరకు పన్ను రహితంగా ఉంటుంది. ఇదే సమయంలో ఇక్కడ వేతన జీవులకు అయితే రూ. 75 వేలు స్టాండర్డ్ డిడక్షన్‌తో (ప్రామాణిక తగ్గింపు) కలుపుకుంటే.. రూ. 12.75 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ చెల్లించాల్సిన పని లేదు. స్టాండర్డ్ డిడక్షన్ పన్ను వర్తించే ఆదాయాన్ని తగ్గిస్తుంది.


కొత్త పన్ను విధానం పన్ను శ్లాబులు.. (2025-26 ఆర్థిక సంవత్సరం, 2026-27 మదింపు సంవత్సరం)


రూ. 4 లక్షల వరకు ఆదాయం: పన్ను లేదు.


రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు: 5% పన్ను.


రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు: 10% పన్ను.


రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు: 15% పన్ను.


రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు: 20% పన్ను.


రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు: 25% పన్ను.


రూ.24 లక్షల పైన: 30% పన్ను.


కొత్త పన్ను విధానంలో గరిష్ట పన్ను రేటు (30 శాతం) పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.24 లక్షలకు పెంచారు. అలాగే, ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచారు. జీతం పొందే వారికి మరింత ఊరటనిస్తూ, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని అంతకుముందే రూ. 50,000 నుంచి రూ. 75,000కు పెంచారు. సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీని కూడా పెంచారు. నికర పన్ను విధించదగిన ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు రూ.60,000 వరకు రిబేట్ క్లెయిమ్ చేసుకోవచ్చు, తద్వారా వారి పన్ను జీరో (జీరో టాక్స్) అవుతుంది. జీతం పొందే వ్యక్తులకు రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో, రూ.12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌కు యజమాని కాంట్రిబ్యూషన్‌పై తగ్గింపు పరిమితిని ప్రాథమిక జీతంలో 14 శాతానికి పెంచారు. దీనిని కూడా పన్ను వర్తించే ఆదాయం నుంచి మినహాయించుకోవచ్చు.


పాత పన్ను విధానం:


రూ.2,50,000 వరకు: పన్ను లేదు


రూ.2,50,001 నుంచి రూ.5,00,000 వరకు: 5 శాతం


రూ.5,00,001 నుంచి రూ.10,00,000 వరకు: 20%


రూ.10,00,000 పైన: 30 శాతం


కొత్త పన్ను శ్లాబుల ద్వారా ఎంత ఆదా చేయగలరు? అనేది ఉదాహరణతో చూద్దాం.


ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.15 లక్షలు అనుకుందాం.


పాత పన్ను విధానం ప్రకారం: మొత్తం పన్ను రూ.2,62,500 అవుతుంది.


కొత్త పన్ను విధానం ప్రకారం: మొత్తం పన్ను రూ.1,05,000 అవుతుంది.


అంటే, కొత్త పన్ను విధానం ప్రకారం ఈ వ్యక్తి రూ.1,57,500 ఆదా చేయగలరు.


మరో ఉదాహరణ: ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.21 లక్షలు అయితే, వారు కొత్త పన్ను విధానం ద్వారా రూ. 2,22,500 ఆదా చేయగలరు.


ఈ గణనీయమైన మార్పులతో, కొత్త ఆదాయపు పన్ను శ్లాబులు పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా మధ్యతరగతి వారికి భారీ ఆర్థిక ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com