రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సంవత్సరానికి 2025 గానూ కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చనుంది. ఈసారి ఏకంగా రూ. 2.50 లక్షల కోట్లు మేర సరప్లస్ ఫండ్ బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.10 లక్షల కోట్ల డివిడెండ్ ఇచ్చింది. ఈసారి దానికి దాదాపు ఐదో వంతు అధికంగా డివిడెండ్ చెల్లించే అవకాశాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం. ఒక వేళ అనుకున్నట్లు ఈ మొత్తం చెల్లిస్తే ఆర్థిక సంవత్సరం 2025-26 కోసం వార్షిక బడ్జెట్లో అంచనా వేసిన రూ. 2.2 లక్షల కోట్లు మించిపోతుంది. అలాగే రాష్ట్రాల అధిక రుణాల అవసరాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రూపాయి మారక విలువను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డు స్థాయిలో డాలర్ అమ్మకాలు చేపట్టింది. అలాగే పెద్ద ఎత్తున లిక్విడిటీ కార్యకలాపాల చేసింది. వీటి ద్వారా సంపాదించిన వడ్డీ ఆదాయంతో భారీ డివిడెండ్ చెల్లించే అవకాశాలను పెంచుతున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఒక విదేశీ బ్యాంకింగ్ సంస్థ ఈసారి డివిడెండ్ రూ. 3.5 లక్షల కోట్లకు పెరగొచ్చని అంచనా వేయడం గమనార్హం.
ప్రభుత్వ రుణాలు నిర్వహించే రిజర్వ్ బ్యాంక్ 2025 ఆర్థిక ఏడాది సర్ ప్లస్ ఫండ్స్ని మే నెల చివర్లో ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గిస్తాయి. ప్రభుత్వ వ్యయం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సైతం పెంచుతుంది. ఆర్థిక మందగమనం కారణంగా పన్ను వసూళ్లు తగ్గిన క్రమంలో ఈ మార్గం ద్వారా అధిక లిక్విడిటీ అందుతోంది. ఈ డివిడెండ్ బాండ్ మార్కెట్కు ప్రయోజనం చేకూర్చుతుంది.
రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్పై ఉన్న సమాచారం మేరకు విశ్లేషకులు ఈ లెక్కలు వేస్తున్నారు. గత ఏడాది రూ. 2.1 లక్షల కోట్ల సర్ ప్లస్ ఫండ్స్ మించే అవకాశం ఉందని చెబుతున్నారు. రూపాయికి మద్దతు ఇచ్చేందుకు, విదేశీ మారకం రేటు స్థిరత్వాన్ని కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ డాలర్ అమ్మకాలు చేపట్టింది. బలమైన లిక్విడిటీ పరిస్థితులతో బ్యాంకులకు నిధులు అందించింది. దీంతో వడ్డీ ఆదాయం భారీగా పెరిగింది. అందుకే 2025 ఆర్థిక సంవత్సరం కోసం డివిడెండ్ భారీగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
![]() |
![]() |