హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను కరెంట్ షాక్తో హత్య చేసిన ఓ మహిళ.. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఏమీ తెలియనట్లుగా సొంత ఊరుకు వెళ్లిపోయింది. బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిలు, కవిత దంపతులు కేపీహెచ్బీ కాలనీలో నివాసముంటున్నారు. స్థానికంగా ఓ నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్కు వాచ్మెన్గా పనికి కుదిరారు. అయితే గత 15 ఏళ్లుగా భార్య, భర్తలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ వేర్వేరుగా జీవనం కొనసాగిస్తున్నారు.
వారిద్దరికీ వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. కాగా, రెండ్రోజుల క్రితం కవిత తన సొంతూరు వెళ్లి భర్త సాయిలు పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని చెప్పింది. దీంతో గ్రామంలోని బంధువులు, సన్నిహితులు సాయిలు కోసం వెతికారు. అతడి ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్బీ పోలీసులు విచారణ ప్రారంభించగా.. భార్య కవితే అతడిని హత్య చేసినట్లు తెలిసింది.
భర్త సాయిలు వేధింపులను భరించలేక ఈ నెల 18న కవిత అతడికి విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి కవిత తన చెల్లెలి భర్త సహాయాన్ని కూడా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.
![]() |
![]() |