ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ పౌరులను వెనక్కి పంపించండి.. అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్‌ షా ఫోన్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 08:51 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కీలక చర్యలకు దిగింది. రెండు దేశాల మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ-సీసీఎస్.. 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ప్రధానంగా దేశంలో ఉంటున్న పాక్ జాతీయులను తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో పాక్ వాసులు భారత్‌లో పర్యటించేందుకు.. సార్క్ వీసా పొడిగింపు పథకం కింద అవకాశం కల్పించారు. తాజా ఉగ్రదాడి నేపథ్యంలో వారందరూ 2 రోజుల్లోగా భారత్‌ను ఖాళీ చేసి.. తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక మెడికల్ వీసాలపై భారత్‌కు వచ్చిన వారు కూడా వెళ్లాలని పేర్కొంది. దీంతో చాలా మంది పాక్ వాసులు.. సరిహద్దు దాటుతున్నారు.


ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న పాక్ పౌరులను వెనక్కి పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల సీఎంలతో శుక్రవారం మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్‌ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ముందుగా ఆ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే వారి వీసాలను రద్దు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.


ఇప్పటికే పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను కేంద్రం రద్దు చేసింది. దీంతో చాలా మంది అట్టారీ-వాఘా సరిహద్దు వద్దకు భారీగా తరలివచ్చారు. తాజాగా అమిత్ షా ఇచ్చిన ఆదేశాలతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్తాన్ వాసుల కోసం జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కూడా పాకిస్తాన్ పౌరుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 208 మంది పాక్‌ జాతీయులు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారందరి వివరాలను సేకరించి.. రెండు రోజుల్లో నగరాన్ని వీడి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు.


పాకిస్తాన్ వాసులకు జారీ చేసిన వీసాలు అన్నీ ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి రద్దు అయినట్లేనని విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. పాక్‌ జాతీయులకు జారీచేసిన మెడికల్‌ వీసాలు మాత్రం ఏప్రిల్‌ 29వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్రం తెలిపింది. వీసాల గడువు ముగిసేలోగా భారత్‌లో ఉన్న పాక్‌ పౌరులు మొత్తం దేశాన్ని వీడాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో పాకిస్తాన్‌లో ఉన్న భారతీయులందరూ త్వరగా స్వదేశానికి తిరిగి రావాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com