ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిటైర్డ్ ఉద్యోగినికి వీడియో కాల్ చేసి.. కొడుకులను చంపేస్తామని బెదిరించి

Crime |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 10:38 PM

నేరగాళ్లు రూటు మారుస్తున్నారు. ఒకప్పుడు మాటు వేసి చోరీలు చేసిన దొంగలు.. ఆ తర్వాత శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. అనంతరం చైన్ స్నాచింగ్‌లు, అర్ధరాత్రి ఇళ్లల్లోకి ప్రవేశించి దొంగతనాలు మొదలుపెట్టారు. ఇప్పుడు టెక్నాలజీ అప్ డేట్ కావటంతో.. దొంగలు కూడా రూటు మార్చారు. ఇళ్లల్లోకి చొరబడి చోరీలు, దారి దోపిడీలు తగ్గించారు. కొత్త తరహా మోసాలకు తెరతీశారు. అదే సైబర్ మోసం.. ఇంట్లోనే కూర్చుని, సులువుగా డబ్బు కాజేయవచ్చనే ఆలోచనతో ఈ మధ్య సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓటీపీలు, పాస్ వర్డుల ద్వారా ఇన్నాళ్లు నగదు కాజేసిన సైబర్ మోసగాళ్లు.. ఇప్పుడు డిజిటల్ అరెస్టులంటూ బెదిరిస్తూ నగదు కాజేస్తున్నారు. మరీ ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోతున్నారు. అలాంటి ఘటనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.


కోనసీమ జిల్లా కొత్తపేటలో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఓ రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి భారీ మోసానికి పాల్పడ్డారు. ఆమె నుంచి భారీ మొత్తంలో డబ్బు కొట్టేశారు. రిటైర్డ్ ఉద్యోగిని ఈ మధ్య తన బ్యాంకు ఖాతాలో రూ.30 లక్షలు జమ చేశారు. ఈ సంగతిని సైబర్ నేరగాళ్లు పసిగట్టారు. ఆమె వివరాలను తెలుసుకుని సీబీఐ అధికారులమంటూ రిటైర్డ్ ఉద్యోగిని ఫోన్ చేశారు. తాను సీబీఐ అధికారులమని డబ్బు ఇవ్వకపోతే మీ కొడుకులను చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో రిటైర్డ్ ఉద్యోగినికి వీడియోకాల్ చేసి మరీ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన ఆమె.. తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.30 లక్షలు నగదును వారికి బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత తాను మోసపోయిన విషయం గ్రహించిన రిటైర్డ్ ఉద్యోగిని.. కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


సీబీఐ, ఈడీ అధికారులమని బెదిరిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. పోలీసులు, సైబర్ నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ గుర్తించాలని సూచిస్తున్నారు. పోలీసులు, సీబీఐ లేదా ఇతర అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌ను నమ్మవద్దని కోరుతున్నారు. అధికారులు ఎప్పుడూ ఫోన్ ద్వారా డిజిటల్ అరెస్టులు చేయరని చెప్తున్నారు. దీనిపై కాలర్ ట్యూన్ల ద్వారా కూడా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు బ్యాంక్ వివరాలు, ఓటీపీ, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు.


ఎవరైనా ఫోన్ కాల్ చేసి ఇలా అధికారులమని చెప్తే.. వారి ఐడీ నంబర్, బ్యాడ్జ్ వంటి గుర్తింపు వివరాలను అడిగి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ధృవీకరించుకోవాలంటున్నారు. తక్షణం డబ్బు చెల్లించాలి, అరెస్ట్ అవుతారనే బెదిరింపులను నమ్మవద్దని కోరుతున్నారు. సాధ్యమైతే, కాల్‌ను రికార్డ్ చేయడం లేదా వివరాలను నోట్ చేసి, సైబర్ క్రైమ్ విభాగానికి రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్ లేదా మెసేజ్ వస్తే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com