వరకట్న పిశాచి మరో వివాహితను బలి తీసుకుంది. మంచి ఉద్యోగం చేస్తున్న మహిళను కూడా కట్నం కోసం వేధింపులకు గురి చేశారు అత్తింటి వాళ్లు. వారి ఆగడాలు భరించలేక.. కన్నవారికి తన కష్టం చెప్పుకుని ఇబ్బంది పెట్టలేక దారుణ నిర్ణయం తీసుకుంది. ఏడాది వయసున్న కుమారుడి గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది. పైగా బిడ్డను తన అత్తింటి వారికి ఇవ్వొద్దని.. తల్లిదండ్రులే చూడాలని కోరింది. ఆ వివరాలు..
ఆడబిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. తమకున్నంతలో బిడ్డను బాగా చూసుకున్నారు. మంచి చదువులు చదివించారు. ఆమె కూడా బాగా చదువుకుని సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంది. ఉద్యోగం వచ్చింది..ఇక పెళ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుంది అని భావించిన తల్లిదండ్రులు.. మంచి సంబంధం చూసి.. భారీగా కట్నం ఇవ్వడానికి ఒప్పుకుని బిడ్డకు పెళ్లి చేశారు. కోటి ఆశలతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఆమెకు రెండేళ్లలోనే జీవితంపై విరక్తి కలిగేలా చేశారు భర్త, అత్తింటి వారు. ఆ మహిళ ఎంతటి మానసిక వ్యధకు గురైందంటే.. ఏడాది వయసున్న కొడుకు గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది. పైగా బిడ్డను తన అత్తింటి వారికి ఇవ్వకుండా.. తల్లిదండ్రులే పెంచాలని కోరి.. అర్ధాంతరంగా కన్ను మూసి.. కన్నవారికి తీరని దుఖాన్ని మిగిల్చింది. పసివాడి ఏడుపు చూసి ప్రతి ఒక్కరు కన్నీరు పెడుతున్నారు. అసలింతకు ఏం జరిగింది.. ఆ మహిళ ఎందుకు దారుణ నిర్ణయం తీసుకుంది అంటే..
జగిత్యాలకు చెందిన ఓ మహిళ భర్త, అత్తింటి వేధింపులు తాళలేక.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల, పోచమ్మవాడలో బుధవారం సాయంత్రం ఈ దారుణం వెలుగు చూసింది. చనిపోయిన మహిళను.. లక్ష్మీ ప్రసన్నగా గుర్తించారు. ఇక పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గంగాధర్-శోభ దంపతుల కుమార్తె లక్ష్మీప్రసన్న(29)కు రెండేళ్ల కిందట వివాహం అయ్యింది. వెల్గటూరు మండలం రాంనూర్కు చెందిన తిరుపతితో ఆమెకు పెళ్లి చేశారు. భార్యాభర్తలిద్దరూ బెంగళూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం లక్ష్మీ ప్రసన్న దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. డెలివరీ తర్వాత నుంచి లక్ష్మీప్రసన్న ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటుంది.
అప్పటి నుంచి లక్ష్మీ ప్రసన్నకు కష్టాలు మొదలయ్యాయి. భర్త, అత్తింటి వారు అదనపు కట్నంతోపాటు ఆమె కుమారుడి పోలికపై అనుమానం వ్యక్తం చేస్తూ.. సూటిపోటి మాటలతో ఆమెని వేధించసాగారు. అంతేకాక వివాహం సమయంలో ఒప్పుకున్న కట్నం డబ్బులు ఇవ్వాలంటూ లక్ష్మీ ప్రసన్నభర్త వేధించేవాడు. పెళ్లి సమయంలో లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు.. రూ.55 లక్షల కట్నంగా ఇస్తామని ఒప్పుకున్నారు. అందులో పెళ్లి నాటికి రూ.10 లక్షల నగదు చెల్లించి మిగతాది భూమి విక్రయించిన తర్వాత ఇస్తామని చెప్పారు.
ఇక తాజాగా లక్ష్మీ ప్రసన్న జాబ్ మానేసి ఇంటి వద్ద ఉంటున్నప్పటి నుంచి కట్నం డబ్బులు తేవాలని భర్త, అత్తింటివారు వేధింపులు మొదలుపెట్టారు. ఇలా ఉండగా 5 రోజుల కిందట లక్ష్మీ ప్రసన్న దంపతులిద్దరూ బెంగళూర్ నుంచి రాంనూర్కు చేరుకున్నారు. బుధవారం గంగాధర్ రాంనూర్ వెళ్లి కుమార్తె మనువడిని తీసుకొని జగిత్యాలకు వచ్చారు. సాయంత్రం తన గదిలోకి వెళ్లిన లక్ష్మీ ప్రసన్న ప్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతేకాక అద్దంపై ‘అమ్మానాన్న.. నాకు బతకాలని లేదు.. నా కుమారుడు జాగ్రత్త.. నా బిడ్డను నా భర్త, అత్తింటి వాళ్లకు మాత్రం ఇవ్వకండి’ అని రాసి.. ఆత్మహత్య చేసుకుంది.
గదిలోకి వెళ్లిన లక్ష్మీ ప్రసన్న ఎంతకు బయటకు రాకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చి చెక్ చేయగా.. ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు తెలపడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకుని.. లక్ష్మీ ప్రసన్న డెడ్బాడీని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం తండ్రి గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త తిరుపతి, అత్తమామలు, ముగ్గురు ఆడబిడ్డలపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa