ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ నుంచి దిగుమతులు బంద్.. భారత్‌లో వీటి ధరలు పైపైకి

national |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 08:34 PM

నాలుగు రోజుల క్రితం అనగా ఏప్రిల్ 22, మంగళవారం నాడు.. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో మిని స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన బైసరన్ మైదానంలో ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులు మీద కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అంతేకాక పాక్ పౌరుల వీసాలు రద్దు, అట్టారి-వాఘా సరిహద్దు మూసివేత నిర్ణయంతో పాకిస్థాన్‌ను దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. అంతేకాక ఇండియా వచ్చిన పాక్ పౌరులు ఏప్రిల్ 27 లోగా దేశం విడిచి వెళ్లాలని.. ఎమర్జెన్సీ హెల్త్ వీసాలు కలిగిన వారు ఏప్రిల్ 29 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. భారతదేశంలో పాకిస్తాన్ అధికారిక ఎక్స్ ఖాతాను కూడా భారత ప్రభుత్వం నిషేధించింది.


ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారత్-పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులను ప్రభావితం చేయనున్నాయి. ఈ క్రమంలో భారత్ కనుక పాక్ దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తే.. అది మార్కెట్‌పై ప్రభావం చూపి పలు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి అంటున్నారు. మరి పాక్ నుంచి దిగుమతులు బంద్ చేస్తే.. మన దేశంలో ఏ వస్తువులు ధరలు పెరుగుతాయంటే..


ఆప్టికల్ లెన్స్‌లు:


పాకిస్తాన్ కళ్లద్దాల లెన్సులు భారీగా ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలో వీటికి భారీగా డిమాండ్ ఉండటంతో ఆప్టికల్ లెన్స్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు మార్కెట్ నిపుణులు.


డ్రై ఫ్రూట్స్:


పాకిస్తాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది.పాక్ దిగుమతల మీద నిషేధం విధిస్తే.. డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోతే వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు.


రాక్ సాల్ట్:


భారత్ పెద్ద మొత్తంలో పాకిస్తాన్ నుంచి రాక్ సాల్ట్‌ను దిగుమతి చేసుకుంటుంది.దీన్ని కొన్ని రకాలా అనారోగ్య సమస్యలకు సైతం వినియోగిస్తారు. దాంతో రాక్ సాల్ట్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది.


ఇతర ఉత్పత్తులు:


భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంట్, ముల్తానీ మట్టి, పండ్లు, పత్తి, ఉక్కు, తోలు ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది. దిగుమతులపై నిషేధం విధిస్తే.. వీటి ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడే అవకాశం కనిపిస్తోంది.


భారత్ కూడా పాక్ ఎగుమతులపై నిషేధం విధిస్తే.. పాక్ పరిస్థితి మరీ దారుణంగా ఉండనుంది. వారికి భారత్ నుంచి దిగుమతులు బంద్ అయి, ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఎగుమతులపై నిషేధం విధిస్తే.. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అవుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com