లోన్ యాప్ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప.. కట్టడి కావడం లేదు. అక్కరకోసమో.. లేక బయట అప్పు పుట్టకనో.. లోన్ యాప్స్ని ఆశ్రయిస్తే.. ఆ తర్వాత అవి వారి పాలిట యమపాశాలు అవుతున్నాయి. డబ్బులు చెల్లిస్తున్నా సరే.. వేధింపులకు గురి చేస్తుంటారు. బంధువులు, తెలిసిన వారికి కాల్స్ చేయడం, మార్ఫింగ్ ఫొటోలు పంపి పరువు బజారుకీడ్చి.. ఆఖరకు ఆత్మహత్యే శరణ్యం అనుకునే పరిస్థితికి తీసుకువస్తున్నాయి. లోన్ యాప్స్ ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం లోన్ యాప్ వేధింపులు భరించలేక.. పెళ్లైన 40 రోజులకే ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ఈ లోన్ యాప్ ముఠాను అరెస్ట్ చేశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ లోన్ యాప్ పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వివరాలు..
తాజాగా విశాఖ పోలీసులు.. నగరంలో లోన్ యాప్ ముఠాను ఒకదాన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ యాప్ ద్వారా సుమారు రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. ఈ ముఠా లోన్ యాప్ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
కొన్నాళ్ల క్రితం నరేంద్ర అనే వ్యక్తి.. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక.. ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లైన 40 రోజులకే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. అయితే నరేంద్ర లోన్ యాప్లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. దాంతో లోన్ యాప్ ముఠా నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి అతడి బంధువులకు పంపించారు. ఈ అవమానం తట్టుకోలేకపోయిన నరేంద్ర పెళ్లయిన 40 రోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో భాగంగా.. పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. భారత్ నుంచి సుమారు 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్లు, రూ.60 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
![]() |
![]() |