ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ 5 క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? మీకు ఐటీ నోటీసులు వస్తాయ్

business |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 11:42 PM

ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు మీ ఆర్థిక లావాదేవీలపై ఒక కన్ను వేసి ఉంచుతోంది. మీ ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన ఉందో లేదో తెలుసుకోవడానికి అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ముఖ్యంగా కొన్ని రకాల నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చేసే ఈ 5 రకాల నగదు లావాదేవీలు మిమ్మల్ని ఐటీ శాఖ నోటీసుల వరకు లాగొచ్చు. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడండి. అందుకే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని ఆదాయ వనరుల్ని వెల్లడించారు. పరిమితికి మించిన లావాదేవీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.


1. పొదుపు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేయడం..


మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు) మీ సేవింగ్స్ అకౌంట్లో ఒకేసారి లేదా పలుమార్లు కలిపి రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే, ఈ సమాచారాన్ని బ్యాంకులు నేరుగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తాయి. దీని అర్థం మీరు పన్ను ఎగవేస్తున్నారని కాదు, కానీ ఈ భారీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందో శాఖ మిమ్మల్ని అడగవచ్చు. మీ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే లేదా మీ ఆదాయానికి సరిపోలకపోతే, మీకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.


2. నగదుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం..


ప్రస్తుతం FDలపై వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండటంతో చాలా మంది ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన FDలను నగదు రూపంలో చేస్తే, ఇది కూడా ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వస్తుంది. మీరు ఈ మొత్తాన్ని వేర్వేరు బ్యాంకుల్లో జమ చేసినప్పటికీ, మొత్తం పరిమితిని దాటితే శాఖ దీనిని గుర్తిస్తుంది. కాబట్టి, ఎఫ్‌డీ కోసం మీరు ఉపయోగిస్తున్న డబ్బు మూలం స్పష్టంగా ఉండాలి.


3. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా బాండ్లలో నగదు పెట్టుబడి..


మీరు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు లేదా డిబెంచర్ల వంటి వాటిలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును పెట్టుబడి పెడితే, ఈ సమాచారం కూడా ఆదాయపు పన్ను శాఖకు వెళుతుంది. దీనికి వెంటనే మీకు నోటీసు రాకపోవచ్చు, కానీ మీ ఆదాయానికి, ఈ పెట్టుబడికి మధ్య పెద్ద వ్యత్యాసం ఉంటే, విచారణ జరిగే అవకాశం ఉంది. నగదు రూపంలో పెట్టుబడి పెట్టడం సాధారణంగా అనుమానాస్పదంగా చూస్తారు. ఎందుకంటే దీనికి డిజిటల్ రికార్డ్ ఉండదు.


4. నగదు రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించడం..


మీరు ప్రతి నెలా రూ. 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే, ఈ లావాదేవీ కూడా ఆదాయపు పన్ను శాఖ రికార్డులలో నమోదవుతుంది. దీనికి నేరుగా నోటీసు రాకపోవచ్చు, కానీ ఇంత పెద్ద మొత్తంలో నగదు మీకు ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న తలెత్తవచ్చు. కాబట్టి, ఇలాంటి పెద్ద చెల్లింపులను డిజిటల్ మార్గాల ద్వారా చేయడం మంచిది.


5. ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు నగదు చెల్లింపు..


మీరు రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తే, ఆ మొత్తం మూలాన్ని మీరు తప్పనిసరిగా తెలియజేయాలి. నగరాల్లో ఈ పరిమితి రూ. 50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 20 లక్షలుగా ఉండవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఈ పరిమితులు మరింత కఠినంగా ఉండవచ్చు. మీరు నగదు రూపంలో చెల్లింపు చేసి, దాని మూలాన్ని స్పష్టంగా చెప్పకపోతే, ఆదాయపు పన్ను శాఖ మీకు రుజువులు అడగవచ్చు. మీరు ఈ సమాచారాన్ని రిజిస్ట్రేషన్ పత్రాలలో చూపించవచ్చు లేదా ఫారం 26QB ద్వారా తెలియజేయవచ్చు.


మొదటగా భయపడొద్దు. మీ ముఖ్యమైన ఆర్థిక పత్రాలన్నింటినీ (బ్యాంకు స్టేట్‌మెంట్‌లు, పెట్టుబడి రుజువులు, నగదు మూలాధారాలు వంటివి) సిద్ధంగా ఉంచుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే, తప్పకుండా ఒక విశ్వసనీయ పన్ను నిపుణుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్‌ను సంప్రదించండి. పన్ను నియమాలను పాటించడం, మీ లావాదేవీలలో పారదర్శకతను కలిగి ఉండటం భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com