దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటైనా అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం కూలిన ఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాయి. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా ఈ విషాదకరమైన ఘటనపై స్పందించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, పీపీపీ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఇక ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి విమానంలోని బ్లాక్ బాక్స్ దొరకగా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించే పనిలో అధికారులు పడ్డారు.
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ వేదికగా అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో తాను బాధపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయి దుఃఖిస్తున్న బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ హృదయ విదారక విషాదం వల్ల ప్రభావితం అయిన వారందరి కోసం పాకిస్తాన్ ప్రార్థనలు చేస్తోందని షెహబాజ్ షరీఫ్ రాసుకొచ్చారు.
మరోవైపు.. షెహబాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఇదే రకమైన సందేశం ఇచ్చారు. ఈ ఘటన మానవత్వానికి అతీతమైనదని అని ట్వీట్ చేశారు. అహ్మదాబాద్లో జరిగిన హృదయ విదారక ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ వినాశకరమైన నష్టం సరిహద్దులను దాటి.. భారత్, పాకిస్తాన్ ఉమ్మడి మానవత్వాన్ని గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో జర్దారీ కూడా సానుభూతిని తెలియజేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిరిండియా విమానం కూలిపోయిన విషాదకరమైన సంఘటన గురించి వినడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే బోయింగ్ 787 విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు మినహా 241 మంది ప్రాణాలు విడిచారు. ఇక ఆ విమానం బీజే మెడికల్ కాలేజీ కాంప్లెక్స్లోని హాస్టల్పైకి దూసుకెళ్లడంతో అక్కడ కొందరు మెడికల్ విద్యార్థులు చనిపోయారు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా ప్రపంచ నాయకులు ప్రాణ నష్టంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 230 మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్ పౌరులు, ఒక కెనడియన్ జాతీయులు ఉన్నారు.
ఈ ఘటనపై ఎయిరిండియా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం భరించలేని విషాదమని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాము హృదయ విదారకంగా ఉన్నామని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa