ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో యుద్ధమే, మాకు వేరే ఆప్షన్ లేదు.. బిలావల్ భుట్టో

international |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 08:20 PM

పహల్గా్మ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయడంతో ఆ దేశం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలోనే సింధు జలాలను విడుదల చేయాలని ఇప్పటికే భారత్‌కు అనేకసార్లు విజ్ఞప్తి చేసింది. పాక్ ప్రభుత్వం నరేంద్ర మోదీ సర్కార్‌కు లేఖలు కూడా రాసింది. అయితే ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్.. దాన్ని పూర్తిగా ఆపేసేవరకు సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పింది. ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశాలపై మాత్రమే పాకిస్తాన్‌తో భారత్ చర్చలకు సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ .. రెండు దేశాలు చర్చలు పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై యుద్ధం తప్పదని హెచ్చరించారు. సింధు జలాల విషయంలో భారత్‌తో యుద్ధమేనని.. పాకిస్తాన్‌కు మరో ఆప్షన్ లేదని వెల్లడించారు.


రెండు దేశాల మధ్య ఉన్న అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు అవసరమని బిలావల్ భుట్టో జర్దారీ తేల్చి చెప్పారు. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా భారత్‌తో చర్చలు కోరుతూ ఇలాంటి ప్రకటన చేసిన కొన్ని రోజులకే బిలావల్ భుట్టో కూడా విజ్ఞప్తి చేయడం గమనార్హం. జర్మన్ బ్రాడ్‌కాస్టర్ డీడబ్ల్యూ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో.. పాకిస్తాన్‌కు నీటి సరఫరాను భారత్ అడ్డుకునే చర్య యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు.


పాకిస్తాన్ నీటి సరఫరాను అడ్డుకోవడానికి భారత్ చేసే ఎలాంటి ప్రయత్నమైనా మనుగడకు ముప్పుగా పరిగణించబడుతుందని బిలావల్ భుట్టో తేల్చి చెప్పారు. ఇది పాకిస్తాన్‌కు యుద్ధం తప్ప మరో మార్గం లేకుండా చేస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఇక పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. అయితే అది తమ దేశ జాతీయ భద్రత లేదా నీటి హక్కుల విషయానికి వస్తే మాత్రం అందులో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. నీటి భద్రత వంటి సమస్యలు చర్చలకు అతీతమని పేర్కొన్నారు. పాకిస్తాన్, భారత్ మధ్య ఉన్న అన్ని అపరిష్కృత సమస్యలు సమగ్ర చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని బిలావల్ భుట్టో అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ చర్చలకు రాకపోతే.. అది వారికి అనుకూలంగా ఉండదని హెచ్చరించారు.


భారత్‌ను చర్చలకు తీసుకురావాలని, రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కాశ్మీర్ సమస్య, జల వివాదాలు, ఉగ్రవాదంతో సహా దక్షిణాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి.. ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత ఈ యుద్ధం హెచ్చరికలు చేశారు. భారత్‌ను చర్చలకు తీసుకురావడానికి పాకిస్తాన్‌కు సహాయం చేయాలని అమెరికాకు కూడా విజ్ఞప్తి చేశారు.


మరోవైపు పాకిస్తాన్‌తో చర్చల గురించి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే తేల్చి చెప్పారు. ఒకవేళ భారత్, పాక్ మధ్య చర్చలు జరిగితే ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఇప్పటికే తెలిపారు. పాకిస్తాన్ గడ్డపై పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకునే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేతను పునఃసమీక్షించబోదని ఇప్పటికే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa