జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం.. దేశం మెుత్తాన్ని షాక్కి గురి చేసింది. దేశీయ విమానయాన రంగం ప్రారంభమైనప్పటి నుంచి ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ విమాన ప్రమాదంలో ఏకంగా 270కిపైగా మంది మరణించారు. ఇంకా చాలా మంది మృతదేహాలను గుర్తించలేదు. ఇప్పటివరకు కేవలం 200 మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగతా వారి మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా బాధితులను గుర్తింపునకు అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇవేమి పట్టని కొంతమంది ఎయిరిండియా దాని అనుబంధ సంస్థలో పని చేసే అధికారులు, సిబ్బంది.. సంఘటన జరిగిన కొన్ని రోజులకే ఏకంగా ఆఫీసులోనే డీజే పార్టీ చేసుకోవడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అయ్యింది.
ఈ పార్టీలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ జీ.ఎం సంప్రీత్ కోటియన్, ఏఐశాట్స్ సీ.ఓ.ఓ అబ్రహం జకారియా, సీ.ఎఫ్.ఓ వంటి ముఖ్య అధికారులు పాల్గొన్నట్లు కొన్ని రోజుల నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. బాధితుల కుటుంబాలు తమ వారి మృతదేహాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఏఐశాట్స్ అంటే ఏంటి?
టాటా గ్రూప్ కంపెనీ ఎయిరిండియా ప్రవేట్ లిమిటెడ్, సింగపూర్కు చెందిన శాట్స్ లిమిటెడ్ ఒక జాయింట్ వెంచర్ నిర్వహిస్తుంది. ఈ రెండింటిని కలిపి ఏఐశాట్స్ అంటారు. ఈ రెండు కంపెనీలు భారత్లోని పలు ఎయిర్పోర్టులలో గ్రౌండ్ క్లియరెన్స్ సేవలను అందిస్తుంది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ మార్గంలో కూలిపోయిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానానికి ఢిల్లీ ఎయిర్పోర్టులో గ్రౌండ్ హ్యాండ్లింగ్, లోడ్ షీట్ లాంటి అనేక అనుమతులను ఈ సంస్థే ఇచ్చింది. ఆ తర్వాతే ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు చేరుకుంది. ఆ తర్వాత ప్రమాదానికి గురైంది. దీంతో 270 మందికిపైగా మృతి చెందారు. ఎన్నో కుటుంబాల్లో ఇది తీరని విషాదం నెలకొంది.
ఇదేమీ పట్టనట్టు ఇందులో పని చేసే ఉద్యోగులు.. జరిగిన ఘోరాన్ని... చేసిన తప్పులను మరిచిపోయి ఏకంగా ఆఫీసులోనే జూన్ 20న ఓ పార్టీ చేసుకున్నారు. మంచిగా లుంగీ డ్యాన్స్ పాట పెట్టుకుని చిందులు వేశారు. కనీసం జరుగుతున్న పరిణామాలకైనా విలువ ఇచ్చి.. నిశ్శబ్దం పాటిద్దామని ఇంగితం కూడా వీరికి లేదు. పైగా వీడియోలను తీసుకుని తెగ సంబరపడిపోయారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజెన్లు తిట్టిపోస్తున్నారు. అసలు మీకు బుద్ధి ఉందా అని కడిగిపారేస్తున్నారు.
అయితే, ఈ వివాదంపై స్పందించిన ఏఐశాట్స్.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటన ఇది అని తెలిపింది. అయినప్పటికీ ఇది ఎవరికైనా మానసిక క్షోభ కలిగించి ఉంటే దానికి తాము చింతిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపింది. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇలాంటి ఎన్ని క్షమాపణలు చెబితే ఏం లాభమని నెటిజెన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో బాధితులు, వారి కుటుంబాల పట్ల తీవ్ర అగౌరవాన్ని, అమానవీయతను చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa