ఇరాన్ అణు స్థావరాలపై జూన్ 13న ఇజ్రాయెల్ ఆకస్మిక దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ సైతం టెల్ అవీవ్పై ప్రతీకార దాడులు చేసింది. ఇదిలా ఉండగా.. అమెరికా మధ్యలో వచ్చి ఇరాన్లోని కీలకమైన మూడు అణుస్థావరాలపై బీ2 బాంబర్లతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఇరాన్ అణు బాంబు తయారుచేస్తోందని, అందుకోసం యురేనియం శుద్ధి చేస్తోందనే కారణంతోనే ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయి. ఇది జరిగితే తమ అస్తిత్వానికే ముప్పు అని పేర్కొంటూ నెతన్యూహు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాలు ఇంత ప్రయాసపడి చేసిన దాడులకు ప్రతిఫలం లేకుండా పోయిందని తెలుస్తోంది. ఈ మేరకుఅమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ నివేదిక విడుదల చేసింది.
ఇరాన్పై అణు స్థావరాలను ధ్వంసం చేసి.. ఆ దేశం శాశ్వతంగా అణు బాంబుల జోలికి పోకుండా చేశామని ఇజ్రాయెల్, అమెరికా ప్రకటించుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ ప్రకటనలు ఎర్లీ సెలెబ్రేషన్సే అని డీఐఏ నివేదిక తేల్చింది. ఇజ్రాయెల్, అమెరికా దాడుల వల్ల.. ఇరాన్ అణు కార్యక్రమం కొన్ని నెలలు మాత్రమే వెనక్కి వెళ్లిందని యూఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగా ఇది "పూర్తిగా ధ్వంసం కాలేదు" అని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ ఆ నివేదిక పేర్కొంది. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనలకు విరుద్ధంగా.. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహాన్ అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాలేదని నివేదిక తెలిపింది.
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా వదులుకునేలా ఒప్పించడానికి తమతో చర్చలు తిరిగి ప్రారంభించాలని అమెరికా ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా చేసిన దాడులు.. అణుబాంబును తయారు చేసేందుకు ఇరాన్ను మరింత ప్రేరేపిస్తాయనే ఆందోళన నెలకొంది. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం.. అణ్వాయుధ తయారీకి అవసరమైన శుద్ధి చేసిన యురేనియాన్ని.. అమెరికా దాడులకు ముందే అణు స్థావరాల నుంచి ఇరాన్ తరలించిందని తెలుస్తోంది. యురేనియంను ఆయుధ-స్థాయికి పెంచడానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్లు చాలా వరకు చెక్కుచెదరకుండా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే, అణ్వాయుధాల తయారు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయి.
అమెరికా దాడుల్లో ఫోర్డో అణుస్థావరం ఎంట్రన్స్ మాత్రమే ధ్వంసమైందని.. లోపల ఉన్న మౌలిక సదుపాయాలకు ఏం కాలేదని నివేదిక చెప్పింది. అయితే ఇలాంటిదేదో జరుగుతుందని ఇంటెలిజెన్స్ అధికారులు.. దాడులకు ముందే హెచ్చరించినట్లు సమాచారం. అయితే డీఐఏ అంచనాలను వైట్ హౌజ్ ఖండించింది. అది "పూర్తిగా తప్పు" అని పేర్కొంది. ట్రంప్ దాడి ప్రభావం గురించి తన చెప్పినదాన్ని సమర్థించుకున్నారు. నెదర్లాండ్స్లో జరిగిన NATO సదస్సులో విలేకరులతో మాట్లాడుతూ, "అది విధ్వంసం, మీరు చూస్తారు" అని ట్రంప్ అన్నారు. దాన్ని ఇంటెలిజెన్స్ సరిగా తేల్చలేదని అని ఆయన అన్నారు. దాని గురించి వార్తలు ప్రచురిస్తున్న మీడియా సంస్థలను నీచులుగా అభివర్ణించారు. అదే NATO సదస్సులో ఉన్న రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్.. ఇంటెలిజెన్స్ అంచనా ఎలా లీక్ అయిందో విచారణ చేస్తామని చెప్పారు. ఆ నివేదికను "ప్రాథమికమైనదిగా, దానిపై తక్కువ విశ్వాసం ఉంచాలని కొట్టిపారేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa