ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్‌లో 4,500 ఏళ్ల నాటి నాగరికత ఆధారాలు వెలుగులోకి

national |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 09:37 PM

దాదాపు 4500 ఏళ్ల కింద నాటి నాగరికత ఆనవాళ్లు రాజస్థాన్‌లో బయటపడ్డాయి. భారత పురావస్తు శాఖ ( ASI ) రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా భాజ్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఆధారాలు భారతదేశ పురాతన నాగరికతలపై మన అంచనాలను మారుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 10, 2024న ప్రారంభమైన ఈ తవ్వకాల్లో సుమారు 4,500 సంవత్సరాల పాత నాగరికతకు చెందిన ఆధారాలు వెలుగుచూశాయి.


పురావస్తు శాస్త్రవేత్తలు 23 మీటర్ల లోతైన ఓ పురాతన నది పాయను (paleo-channel) కనుగొన్నారు. ఇది వేదాల్లో పేర్కొన్న సరస్వతీ నదికి సంబంధించిందని వారు భావిస్తున్నారు. హరప్పా, బ్రజ్, మథుర ప్రాంతాల మధ్య సంస్కృతిను కలుపుతూ.. ఆ నాటి నాగరికతల నివాసానికి కీలక ఆధారంగా ఈ నది వ్యవహరించేదని చెబుతున్నారు.


ఈ తవ్వకాలలో 800కు పైగా పురాతన వస్తువులు వెలుగుచూశాయి. వీటిలో ముఖ్యమైనవి బ్రాహ్మి లిపితో కూడిన అత్యంత పురాతన ముద్రలు, రాగితో తయారు చేసిన నాణేలు, యజ్ఞ కుండాలు, హవన సాధనాలు, మౌర్య, కుషాణ, గుప్త యుగాల నాటి విగ్రహాలు, శివ-పార్వతి ప్రతిమలు, ఆస్తి వినిమయం సూచించే అర్థరత్నాల బీడ్లు, శంఖబంగిళ్ళు, ఒక మానవ కపాల అవశేషం వంటి ఉన్నాయి. ఈ కపాలాన్ని పరిశోధన నిమిత్తం ప్రస్తుతం ఇజ్రాయెల్‌కు పంపించారు ఈ తవ్వకాల ద్వారా మొత్తం ఐదు చారిత్రక దశల ఆధారాలు వెలుగులోకి వచ్చాయి: హరప్పా అనంతర కాలం, మహాభారత యుగం, మౌర్యుల కాలం, కుషాణ యుగం, గుప్త యుగానికి చెందిన ఆనవాళ్లు ఉన్నట్టు తెలిపారు.


శివ– పార్వతి టెర్రకోటా విగ్రహాలు భక్తి, శక్తి సంప్రదాయాలకు సంబంధించినవి, అలాగే, 15 యజ్ఞకుండాలు వేద, మరియు ఉత్తర వేద కాలపు ధార్మిక చట్టాలను సూచిస్తున్నాయి. రాగి, ఇనుము మిశ్రమాలతో ఉపయోగించిన నాణేలు మెటలర్జీ శాస్త్ర పరిజ్ఞానాన్ని వెల్లడిస్తున్నాయి. ఎముకతో తయారైన సూదులు, పళ్ళాలు, అచ్చులు మొదటిసారి భారత తవ్వకాలలో కనిపించడం విశేషం


ప్రాధాన్యత


ఈ తవ్వకాలు రాజస్థాన్ మాత్రమే కాక, ఉత్తర భారతదేశ చరిత్ర దిశను మార్చేలా ఉన్నాయి. ఇది సరస్వతీ నది మానవ నాగరికతపై ఆధారాలు అందిస్తూ, భారత పురాతన సాంస్కృతిక జీవన విధానాలపై విస్తృత అవగాహనను అందించనుంది. పురావస్తు శాఖ ఈ తవ్వక నివేదికను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు సమర్పించగా.. భాజ్ ప్రాంతాన్ని జాతీయ పురావస్తు రక్షిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది. వీటిని భారతదేశ ప్రాచీన నాగరికతకు సంబంధించి రుగ్వేద, సరస్వతి, హరప్పా కాలానికి మధ్య సంబంధాన్ని సూచిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa