రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం అంతారం గ్రామంలో ఎమ్మార్వో నాగార్జున, వీఆర్ఏ యాదగిరి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన మంగళవారం (జులై 1) చోటుచేసుకుంది. అవినీతి అధికారుల బాగోతం బట్టబయలు కావడంతో రైతులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
వివరాల్లోకి వెలితే.. అంతారం గ్రామానికి చెందిన రైతు మల్లయ్య తన భూమి పేరు మార్పిడి (మ్యుటేషన్) కోసం తలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అయితే ఈ పని పూర్తి చేయడానికి ఎమ్మార్వో నాగార్జున. వీఆర్ఏ యాదగిరి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. చివరికి, రూ. 10 వేలు లంచం ఇవ్వాలని మల్లయ్యను కోరారు. అవినీతిని ఎంత మాత్రం సహించలేని మల్లయ్య.. ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. మంగళవారం మల్లయ్య లంచం డబ్బులను ఎమ్మార్వో నాగార్జున, వీఆర్ఏ యాదగిరికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం డబ్బులను స్వాధీనం చేసుకుని ఎమ్మార్వో, వీఆర్ఏలను అరెస్టు చేశారు.
ఈ వార్త తలకొండపల్లి మండలంలో హాట్ టాఫిక్గా మారింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొందరు రైతులు ఏకంగా తహశీల్దార్ కార్యాలయం ముందు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకుని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. ఇది అవినీతి అధికారుల పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని, అటువంటి చర్యలపై ప్రజల ఆకాంక్షను స్పష్టం చేసింది. తలకొండపల్లి ఎమ్మార్వో నాగార్జునపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లు, పేరు మార్పిడులు, ఇతర రెవెన్యూ పనుల కోసం ఆయన భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఏసీబీకి ఫిర్యాదులు అందినప్పటికీ ఆయన పట్టుబడలేదు. ఎట్టకేలకు ఇప్పుడు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోవడంతో అతని అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో ఎక్కువగా ఉన్న అవినీతిపై మరోసారి చర్చ మొదలైంది. ప్రభుత్వం ఇలాంటి అవినీతిని అరికట్టడానికి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa