ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రోల్స్‌పై హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికరమైన స్పందన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 10:09 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో తీర్పు విషయమై సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఆయన స్పందించారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఆయన ట్రోల్స్‌పై మాట్లాడారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారని జస్టిస్ అన్నారు. ‘‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫ్ఫైర్స్’ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం, తన బెంచ్ ముందున్న బెయిల్ కేసులను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని సూచించారు.


 కల్తీ నెయ్యి కేసులో బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్ చేయడానికి పనికి వస్తాయని ఆయన పేర్కొనడం గమనార్హం.. పల్నాడు జిల్లా రెంటపాలలో జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్ధుడు మాజీ సీఎం కారు కింద పడి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. రెంటపాల పర్యటనలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. గత వారం సింగయ్య కేసులో జగన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. దీనితో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.


వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులను న్యాయమూర్తి వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చే వారం వేరే ధర్మాసనం ముందుకు పంపాలని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్ (A3), విపిన్ జైన్ (A4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావడా (A5)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరించాలని, దర్యాప్తు అధికారి అడిగినప్పుడు విచారణకు హాజరుకావాలని పిటిషనర్లకు కోర్టు తెలిపింది.


ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు.. బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు పూర్తయిన తర్వాత, న్యాయమూర్తి ఈరోజు (జులై 3న) వారికి బెయిల్ మంజూరు చేశారు. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని చెప్పడం, కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడం, ఇతర బెయిల్ కేసులను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని సూచించడం వంటి విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa