ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాగ్రత్తగా ఉండాలంటూ భారత్‌కి చైనా వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 10:49 PM

దలైలామా వారసుడి విషయంలో కేంద్ర మైనారిటీల వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై పొరుగు దేశం చైనా తీవ్రంగా స్పందించింది. దలైలామా వారసత్వంపై భారత మంత్రి వ్యాఖ్యలు తమ స్థిర విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించిన చైనా.. ఈ విషయంలో భారతదేశం జాగ్రత్తగా వ్యవహరించాలని బీజింగ్ హెచ్చరిక జారీ చేసింది. ధర్మశాలలో గురువారం జరిగిన దలైలామా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వేళ్లే ముందు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దలైలామా వారసుడిని ఎవరిని ఎంపిక చేయాలనేది ఆయనకే లేదా బౌద్ధుల సంస్థ గడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకే హక్కు ఉంది. మూడో పక్షం జోక్యం చేసుకోజాలదు’’ అని వ్యాఖ్యానించారు.


ఈ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ శుక్రవారం స్పందించారు. ‘‘దలైలామా విభజనవాద కార్యకలాపాలకు ప్రతీక. భారత్‌కి ఇది స్పష్టంగా తెలుసుండాలి... టిబెట్ విషయంలో చేసుకున్న ఒప్పందాలను భారత్ గౌరవించాలి. ఇలాంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’’ అని వ్యాఖ్యానించారు. ఇక, దలైలామా సైతం తన వారసుడు చైనా వెలుపల పుట్టే ఉంటాడని వ్యాఖ్యానించారు. కాగా, చైనా వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ‘మత సంబంధమైన నమ్మకాలు, సంప్రదాయాలపై భారత ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయదు.. భారతదేశం ఎల్లప్పుడూ మత స్వేచ్ఛను గౌరవించింది, గౌరవిస్తూనే ఉంటుంది’’ అంటూ కౌంటర్ ఇచ్చింది.


దలైలామా ఏమన్నారు?


బౌద్ధుల గురువు, 14వ దలైలామా 1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి భారత్‌కు ప్రవాసం వచ్చి అప్పటి నుంచి ధర్మశాలలో నివసిస్తున్నారు. ఇటీవల వారసుడి గురించి ఆయన మాట్లాడుతూ.. ‘నా మరణానంతరం పునర్జన్మ ద్వారా వచ్చే దలైలామాను గడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టే గుర్తిస్తుంది. ఆ వ్యక్తి చైనా వెలుపల జన్మించవచ్చు’ అని అన్నారు.


అయితే, చైనా మాత్రం దలైలామా వారసత్వం చైనా చట్టాలు, చారిత్రక సంప్రదాయాలు, బంగారు కలశం ప్రక్రియ ఆధారంగా మాత్రమే నిర్దారించాలని వాదిస్తోంది. ప్రస్తుత 14వ దలైలామా కూడా అదే ప్రక్రియ ద్వారా నియమితులయ్యారని చెబుతోంది.


భారత్–చైనా సంబంధాలు


2020 గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్, చైనాల మధ్య సంబంధాలు దిగజారాయి. కానీ 2024లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో మోదీ– జిన్‌పింగ్ సమావేశం, తదనంతరం పై స్థాయి చర్చలతో సంబంధాల పునరుద్ధరణకు సుగమం అయ్యింది. ఈ క్రమంలో ఇటీవల ఆరేళ్ల తర్వాత కైలాస మానససరోవర యాత్ర పునఃప్రారంభం చైనా–భారత్ నడుమ ఒక సానుకూల సంకేతం. ఈ క్రమంలోనే దలైలామా వారసుడి ఎంపిక అంశం భారత్–చైనా సంబంధాల్లో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని సూచిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa