ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా జోక్యం

international |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 10:59 PM

బౌద్ధుల గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా ప్రభుత్వం వ్యాఖ్యలపై టిబెట్ అధ్యక్షుడు పెన్పా సెరింగ్ తీవ్రంగా స్పందించారు. ‘మతాన్ని నమ్మని ప్రభుత్వం మతసంబంధిత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటీ?’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా మతగురువును ఎవరిని కావాలంటే వారినే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మాకుంది’ అని స్పస్టం చేశారు. ‘గోల్డెన్ యూర్న్ ( బంగారు కలశం )’ ప్రక్రియ ఆధారంగానే దలైలామా పునర్జన్మను గుర్తించాలంటూ చైనా ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పెన్పా సెరింగ్ ఘాటుగా స్పందించారు. ‘‘మతాన్ని నమ్మని ప్రభుత్వం మత స్వేచ్ఛపై జోక్యం చేసుకుంటుందా? స్వేచ్ఛగా మా ఆధ్యాత్మిక నాయకుడిని ఎంపిక చేసుకునే హక్కుంది. దేశాన్ని ఆక్రమించడమే కాదు, ఇప్పుడు మత స్వేచ్ఛనూ హరించాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.


“చైనా ప్రభుత్వం సంప్రదాయాన్ని ఉల్లంఘించారని మాపై ఆరోపిస్తోంది. కానీ బంగారు కలశం విధానం 1793లో మాత్రమే ప్రవేశపెట్టారు. దానికి ముందు 8 మంది దలైలామాలు ఎలా ఎంపికయ్యారు? వారు దలైలామాలు కాదా? బంగారు కలశం లేకపోతే వారిని దలైలామాగా గుర్తించరా?’’ అని సెరింగ్ నిలదీశారు.


భారత్ వైఖరి


అటు, దలైలామా వారసుడి ఎంపిక విషయంలో ఇక భారత్ కూడా స్పష్టంగా చెప్పేసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. ‘‘దలై లామా పునర్జన్మను ఆయనే నిర్ణయించాలి. ఇది టిబెటన్ల బౌద్ధ మత సంప్రదాయాల ప్రకారం జరిగే ప్రక్రియ. దాంట్లో మూడో వ్యక్తులు జోక్యం చేసే హక్కు లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు.


ఇప్పటికే దలైలామా తన పునర్జన్మను గుర్తించే అధికారం గడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ చేతిలోనే ఉంటుందని స్పష్టంగా ప్రకటించారు. కానీ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. ‘‘దలైలామా పునర్జన్మ దేశీయ గుర్తింపుతో, బంగారు కలశం, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి. ఇది చట్టబద్ధంగా, మత సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి’ అని అన్నారు.


వారసుడి ఎంపిక.. చైనాకు దలైలామా షాక్


‘గోల్డెన్ యూర్న్’ అనే విధానం 1793లో నాటి చైనా రాజవంశం క్వింగ్ ప్రవేశపెట్టింది. చైనా దీనిని టిబెటన్‌ లామాల ఎంపిక కోసం చేపట్టిన సంప్రదాయంగా పేర్కొంటోంది. కానీ దీనికి అసలైన బౌద్దుల మత సంప్రదాయంతో సంబంధం లేదని CTA అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు.


బంగారు కలశం ప్రక్రియ ఏమిటి?


బంగారు కలశం విధానం 1793లో చైనాను పాలించిన చింగ్ వంశం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో పునర్జన్మకు ఎంపికైన చిన్నారుల పేర్లను బంగారు కలశంలో ఉంచి, వాటిలో నుంచి ఒకటి తీస్తారు. దైవనిర్ణయం ప్రకారం ఎంపిక జరిగిందని ప్రకటించే పద్ధతి ఇది. అయితే, టిబెట్ మత సంప్రదాయం కాదనని, చైనా రాజరిక విధానానికి చెందినదని టిబెటన్ బౌద్ధులు చెబుతున్నారు.


వివాదం ఎందుకు?


బౌద్ధుల గురువు ఎంపిక కోసం బంగారు కలశం విధానం 1793లో మాత్రమే ప్రవేశపెట్టారు. కానీ దీనికి ముందు 8 మంది దలైలామాలు సాధారణంగా ఎంపికయ్యారు. మతగురువు ఎంపికకు బంగారు కలశం అవసరం లేదని బౌద్ధులు అంటున్నారు. మతాన్ని నమ్మని చైనా. దలైలామా పునర్జన్మ విషయమై రాజకీయ జోక్యం చేయాలని చూస్తోంది. వాస్తవానికి దలైలామా తన వారసుడు భారత్‌లోనే జన్మిస్తాడని ఇటీవల రాసిన పుస్తకంలో అభిప్రాయపడ్డారు.


బౌద్ధ సంప్రదాయాలలో పునర్జన్మ అనేది ధార్మిక గురువుల దర్శనం, తపస్సు, సంకేతాల ఆధారంగా గుర్తించే ప్రక్రియ. చైనా విధానం దీనికి విరుద్దంగా ఉంది. దలైలామా వారసుడ్ని ఎవరు నిర్ణయించాలి అనే అంశంపై టిబెట్, భారత్, చైనా మధ్య ఘర్షణ స్పష్టంగా ముదురుతోంది. టిబెటన్ ప్రభుత్వం, భారత్ దలైలామా నిర్ణయమే తుదినిర్ణయం అని చెబుతుంటే, చైనా మాత్రం తన నియంత్రణనకు లోబడి ఉండాలని ఒత్తిడి తెస్తోంది. ఇది టిబెట్ మతస్వేచ్ఛపై మరోసారి చైనా దాడికి ఉదాహరణగా నిలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa